బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం : రాష్ట్ర సర్కారు

బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం : రాష్ట్ర సర్కారు
  • స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్​లైన్​ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు​ సమాలోచనలు
  • ప్రస్తుతం రాష్ట్రపతి  దగ్గర రిజర్వేషన్ల బిల్లు 
  • త్వరలోనే  అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్​ 
  • లీగల్‌‌​ ఒపీనియన్‌‌ ​కూడా తీసుకుంటున్న  ప్రభుత్వం 
  • డెడ్​లైన్‌‌ కన్నా ముందే ఎన్నికలు ముగించేలా ప్రణాళిక​
  • మరోవారం, పది రోజుల్లోనే  క్లారిటీ

హైదరాబాద్, వెలుగు:  స్థానిక ఎన్నికలకు హైకోర్టు  డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర సర్కారు  సమాలోచనలు చేస్తున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ప్రభుత్వం.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్​లో ఉన్నాయి.

 ఈ బిల్లులను పార్లమెంట్​లో ఆమోదించి, 9వ షెడ్యూల్​లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. కానీ ఢిల్లీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో  రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది.  దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలులాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని  ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం ఒకటి కాగా.. లోకల్​బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇవ్వడం రెండోది. కానీ ఇలా చేయడం వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులపైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ఈ రెండూ సాధ్యం కాకపోతే  పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. ఎన్నికలకు వెళ్లడాన్ని ప్రభుత్వం మూడో ఆప్షన్​గా పెట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.  

కాగా, హైకోర్టు తీర్పు తర్వాత సీఎస్​ రామకృష్ణారావును పంచాయతీరాజ్​ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో కలిశారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పులోని అంశాలను వివరించారు. రిజర్వేషన్లపై క్లారిటీ వస్తే.. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్​ రెడ్డికి సీఎస్​ రామకృష్ణారావు  వివరించినట్లు తెలిసింది.

రాష్ట్రపతి స్పందించకుంటే సుప్రీంకోర్టుకు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గత మార్చిలోనే  అసెంబ్లీ అమోదించింది. కానీ  బీసీ రిజర్వేషన్ల పెంపు  రాష్ట్ర పరిధిలో తీసుకునే నిర్ణయం కాకపోవడంతో గవర్నర్​ ఆ బిల్లును  రాష్ట్రపతి ఆమోదం కోసం 

పంపారు. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉంది.  దీనిపై ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లులను 3 నెలల్లోగా క్లియర్​చేయాలని రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరి, మరికొద్ది రోజుల్లో 3 నెలలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో గడువు పూర్తయ్యే వరకు వేచిచూసి.. అప్పటికీ రాష్ట్ర పతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టు మెట్లెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 

మరోవైపు తెలంగాణలో కులగణన, ఇక్కడి నుంచి వెళ్లిన రిజర్వేషన్ల బిల్లుల నేపథ్యంలోనే కేంద్రం జనగణనతోపాటు కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధ్యం కాకుంటే రెండో ఆప్షన్​గా సమగ్ర కులగణన సర్వే వివరాలు, అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు ఆధారంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా సీరియస్​గా పరిశీలిస్తున్నది. 

ప్రస్తుతం ఎస్సీలకు 18, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్​చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది.   

మూడో మార్గంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు.. 

 బీసీలకు నేరుగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటిస్తే వచ్చే న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో..  పార్టీపరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లడాన్ని మూడో ఆప్షన్​గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే అధికారులకు, కాంగ్రెస్​ పార్టీ శ్రేణులకు ఈ మేరకు సంకేతాలిచ్చారు.  మరోవైపు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్ ​కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై త్వరలోనే పీసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా,   రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టును సర్కారు నెల రోజులు, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు ఈసీ రెండు నెలల సమయం అడిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు 3 నెలల గడువును నిర్దేశించింది. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

కానీ  బీసీ బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం లేటైనా.. నేరుగా రిజర్వేషన్లు ప్రకటిస్తే కోర్టులు అడ్డుకున్నా.. నెలరోజుల గడువు మించిపోయే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయడం, వినకుంటే మూడో ఆప్షన్​ కింద నేరుగా కాంగ్రెస్​ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 22 నుంచి 23 శాతం చట్టపరంగా, మరో 20 శాతం పార్టీపరంగా జనరల్​ స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయించాలని భావిస్తున్నది.  42 శాతం స్థానాలను బీసీలకు కేటాయిస్తే అనివార్యంగా మిగిలిన పార్టీలు కూడా  బీసీలకు అదేస్థాయిలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, తర్వాత కేంద్రంపై ఒత్తిడి కొనసాగించవచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తున్నది.