
- 3 నెలల బకాయిలు 135 కోట్లు కూడా రిలీజ్
- సౌతిండియాలోనే అత్యధిక స్టైఫండ్ చెల్లిస్తున్నం: మంత్రి దామోదర
- సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నం: జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: మెడికల్ స్టూడెంట్ల స్టైపెండ్ను ప్రభుత్వం 15% పెంచింది. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లలో పని చేస్తున్న ఇంటర్న్స్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్ను 15 శాతం పెంచుతూ జీవో 90 జారీ చేసింది. ఇది ఈ ఏడాది జనవరి నుంచే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే గత మూడు నెలల స్టైపెండ్ బకాయిలు రూ.135 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్ల ఖాతాల్లో స్టైపెండ్ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 30 నుంచి సమ్మె చేస్తామన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. మెడికోలకు సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టైపెండ్ చెల్లిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఇకపై ప్రతినెల 10న స్టైపెండ్ చెల్లించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు సంవత్సరానికి సరిపడా స్టైపెండ్ చెల్లింపుల కోసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జూడాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
స్టైపెండ్ పెంపు వివరాలివీ..
- హౌస్ సర్జన్ (మెడికల్, డెంటల్): రూ.25,906 నుంచి రూ.29,792కు పెంపు.
- పీజీ డాక్టర్లు: ఫస్ట్ ఇయర్ రూ.58,289 నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్ రూ.61,528 నుంచి రూ.70,757, ఫైనల్ ఇయర్ రూ.64,767 నుంచి రూ.74,482.
- పీజీ డిప్లమా స్టూడెంట్లు: ఫస్ట్ ఇయర్ రూ.58,289 నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్ రూ.61,528 నుంచి రూ.70,757.
- సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు: ఫస్ట్ ఇయర్ రూ.92,575 నుంచి రూ.1,06,461. సెకండ్ ఇయర్ రూ.97,204 నుంచి రూ.1,11,785. థర్డ్ ఇయర్ రూ.1,01,829 నుంచి రూ.1,17,103.
- ఎండీఎస్: ఫస్ట్ ఇయర్ రూ.58,289 నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్ రూ.61,528 నుంచి రూ.70,757, థర్డ్ ఇయర్ రూ.64,767 నుంచి రూ.74,482.
- సీనియర్ రెసిడెంట్స్: రూ.92,575 నుంచిరూ.1,06,461కు పెంపు.