శివ శివా : శ్రీశైలంలో తెలంగాణ లిక్కర్ పట్టివేత..

శివ శివా : శ్రీశైలంలో తెలంగాణ లిక్కర్ పట్టివేత..

శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో మద్యం, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అమ్మకం నిషేధం. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం చెక్ పోస్టు దగ్గర ఉన్న ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి.. దొంగతనంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్న ఓ మహిళను పట్టుకున్నారు పోలీసులు. కొన్నాళ్లుగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ చెక్ పోస్టు అయిన మన్ననూరులో మద్యం కొనుగోలు చేసి.. శ్రీశైలం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. 

ఆ మహిళ నుంచి 166 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా శ్రీశైలం మహాక్షేత్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మద్యం పట్టుబడటం విశేషం. ఆ మహిళను అరెస్ట్ చేసి.. రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు శ్రీశైలం సీఐ ప్రసాదరావు.

మహా పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం అమ్మకాలతోపాటు వినియోగం కూడా నిషేధం అని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేసినట్లయితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆలయ పరిత్రత కాపాడాలని పిలుపునిచ్చారు పోలీసులు.