- నేతలతో సమావేశమైతున్న కేసీఆర్, కేటీఆర్
- కడియం, రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య
- రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి!
- ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోనూ భేటీ
- ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే చాన్స్
- మల్కాజ్గిరికి త్వరలో కొత్త అభ్యర్థి ఎంపిక
హైదరాబాద్, వెలుగు : అసంతృప్తులను బీఆర్ఎస్ బుజ్జగిస్తున్నది. నియోజకవర్గాల్లో వర్గ విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అసంతృప్త లీడర్లతో పాటు ఆశావహులు, ఇతర లీడర్లను పిలిపించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అమెరికా, దుబాయ్ టూర్ ముగించుకుని వచ్చినప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే అసంతృప్త నేతలతో మంత్రి హరీశ్, ఎమ్మెల్సీ కవిత మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. పార్టీ, ప్రభుత్వంలో అవకాశాలపై కేటీఆర్, కేసీఆర్తో మాట్లాడుతామని గతంలోనే హామీలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే అసంతృప్త నేతలు, ఆశావహులు, ఎమ్మెల్యేలను ప్రగతి భవన్కు పిలిపించి కేటీఆర్మాట్లాడుతున్నారు. మొదట ఉమ్మడి వరంగల్జిల్లాపై దృష్టి పెట్టిన ఆయన.. శుక్రవారం స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జనగామ నుంచి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. మరోవైపు కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఉన్న పార్టీ లీడర్లు.. పార్టీ చీఫ్ కేసీఆర్ను కలిశారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసే పనిచేయాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
శాంతించిన రాజయ్య..
స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఈసారి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీపై రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్నాయకత్వంలో పని చేస్తానని చెప్తూనే.. ఆయన కాంగ్రెస్తోనూ టచ్లోకి వెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. మాదిగ మేధావుల సమావేశం సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో రాజయ్య సమావేశమవడంతో ఆయన పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది. చీఫ్విప్వినయ్భాస్కర్ సహా పలువురు నేతలు ఆయనను కలిసి బీఆర్ఎస్లోనే కొనసాగాలని సూచించారు. ఈ క్రమంలో కడియం, రాజయ్యను ప్రగతి భవన్కు పిలిపించుకున్న కేటీఆర్.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. స్టేషన్ఘన్పూర్లో కడి యం శ్రీహరి గెలుపునకు కృషి చేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రాజయ్య.. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్గా అవకాశమిస్తారని సమాచారం.
కేసీఆర్ ను కలిసిన కుత్బుల్లాపూర్ లీడర్లు..
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. పార్టీని గెలిపించాలని ఇద్దరు నేతలకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. మంగళవారం నాటికి పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముండటంతో నర్సాపూర్, గోషామహల్కు చెందిన లీడర్లను శనివారం పిలిపించి మాట్లాడే చాన్స్ ఉంది.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఇక్కడ టికెట్ ఆశిస్తున్న నీలం మధు ముదిరాజ్ను ఒకట్రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడే అవకాశముందని సమాచారం. కాగా, బీఆర్ఎస్ ను వీడుతున్నట్టు మైనంపల్లి ప్రకటించడంతో మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, ప్రస్తుత కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, మండలి రాధాకృష్ణ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
జనగామ టికెట్ పల్లాకు!
సోమ, మంగళవారం నాటికి జనగామ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులను కేటీఆర్ ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
జనగామ టికెట్ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని.. నియోజకవర్గానికి వెళ్లి పని చేసుకోవాలని ఆయనకు కేసీఆర్ సూచించారు. పల్లాతోనూ కేసీఆర్ సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. జనగామ టికెట్ పల్లాకు దాదాపు ఖరారైందని, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారని సమాచారం.