
- నాసిరకం విత్తనాల కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్
- పోలీస్, అగ్రికల్చర్, సీడ్ కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నకిలీ విత్తనాల కట్టడికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. పోలీస్, వ్యవసాయ, సీడ్స్ కార్పొరేషన్ విభాగాలతో కలిసి జాయింట్ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్లు, సరిహద్దు ప్రాంతాల్లో ఈ టాస్క్ఫోర్స్ నిఘా పెడుతుందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. నిషేధిత హెచ్టీ కాటన్, బీజీ-3 విత్తనాలు, నకిలీ, నాసిరకం, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాల సరఫరాను అడ్డుకుంటామని తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థిక నష్టం పొందడమే కాకుండా, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్టీ కాటన్, బీజీ-3 విత్తనాలు పర్యావరణానికి, రైతులకు నష్టం కలిగిస్తాయని.. ఈ విత్తనాలపై రాష్ట్రంలో నిషేధం అమలులో ఉందని స్పష్టం చేశారు. నిషేధిత విత్తనాల సరఫరాదారులపై ఏడేండ్లకు పైగా శిక్షలు విధించే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మళ్లీ మళ్లీ పట్టుబడే వారిని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిస్తామని డీజీపీ హెచ్చరించారు. అలాగే.. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వ్యక్తుల ఆస్తులను స్థానిక తహసీల్దార్ల ద్వారా సీజ్ చేయిస్తామన్నారు.
గతంలో వికారాబాద్, గద్వాల్, రాచకొండ, వరంగల్, రామగుండం కమిషనరేట్ల పరిధిలో పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు, అనధికార పురుగుమందులను సీజ్ చేసినట్లు డీజీపీ వెల్లడించారు. పలువురిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని డీజీపీ సూచించారు.