- 8 నెలల్లో 15,024 మొబైల్స్ రికవర్
- 43,935 ఫోన్లు ట్రేస్.. 1,06,132 బ్లాక్
- మొబైల్స్ పోగొట్టుకున్నోళ్లు దరఖాస్తు చేసుకోవాలని పోలీసుల సూచన
హైదరాబాద్, వెలుగు : మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లలో 33.71 శాతం రికవరీ సాధించారు. ఎనిమిది నెలల వ్యవధిలో 15,024 సెల్ఫోన్స్ను ట్రేస్ చేసి బాధితులకు అందించారు. సెంట్రల్ ఎక్వీప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా రాష్ట్ర సీఐడీ పోలీసులు నిర్వహిస్తున్న మొబైల్స్ ట్రేసింగ్ వివరాలను తాజాగా వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులో పెట్టారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించారు. సీఐడీ ఆఫీస్లోని మెయిన్ సర్వర్తో సీఈఐఆర్ పోర్టల్ను ఆపరేట్ చేస్తున్నారు.
ప్రజలు పోగొట్టుకున్న సెల్ఫోన్స్ను గుర్తించి వారికి అప్పగిస్తున్నారు. ట్రేస్ కాని ఫోన్లు పనిచేయకుండా బ్లాక్ చేస్తున్నారు. ఇలా ఏప్రిల్20వ తేదీ నుంచి ఈ నెల 15 వరకు 43,935 సెల్ఫోన్స్ను గుర్తించారు. వీటిలో 15,024 ఫోన్స్ను బాధితులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1,06,132 ఫోన్లను బ్లాక్ చేశారు. ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు స్థానిక పోలీస్స్టేషన్, మీ సేవా సెంటర్స్, https://www.ceir.gov.in సైట్లో అప్లై చేసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.