- 2015లో ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా అందుబాటులోకి తెచ్చిన ఉన్నతాధికారులు
- ఫుటేజ్తో సిబ్బందిపై యాక్షన్
స్పాట్లో బాడీ వార్న్ కెమెరాలో రికార్డ్అయిన వీడియో అంతా సెంట్రల్ సిస్టమ్ సర్వర్లో అప్లోడ్ అవుతుంది. దాన్ని ఎవరూ ఎడిట్ చేయడానికి వీలుండదు. పబ్లిక్ తో పోలీసుల బిహేవియర్ ను, తనిఖీలు జరిగే టైమ్లో న్యూసెన్స్ చేసే జనాల వీడియోలను నేరుగా అవి సర్వర్లోకి రికార్డ్ చేస్తాయి. ఆ విజువల్స్ను పరిశీలించి ఉన్నతాధికారులు తగిన యాక్షన్ తీసుకొనేవారు. కొన్ని చోట్ల బాడీ వార్న్ కెమెరాలకు బదులుగా కొందరు పోలీసులు స్మార్ట్ ఫోన్, డిజిటల్ కెమెరాలను వాడుతున్నట్టు చెప్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఏడేండ్ల కిందట అందుబాటులోకి తెచ్చిన బాడీ వార్న్ కెమెరాలను పోలీసులు వాడట్లేదు. బందోబస్తులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో వీటిని వాడాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిర్వహణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో కెమెరాలన్నీ మూలనపడుతున్నాయి. 2015 ఆగస్టు 14న మొదటిసారిగా బషీర్ బాగ్ లోని సిటీ కమిషనరేట్ ఆఫీసులో బాడీ వార్న్ కెమెరాలను అప్పటి సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు 150కి పైగా కెమెరాలు అందించారు. మొదట్లో బాడీ వార్న్ కెమెరాలు మంచి రిజల్ట్ ఇచ్చాయి. పబ్లిక్ ప్లేసెస్లో జనాలతో పోలీసుల బిహేవియర్ను స్పాట్లోనే రికార్డు చేసేవి. వీడియో ఫుటేజ్ పరిశీలించి ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకునేవారు.
పోలీసుల ప్రవర్తనలో మార్పు తెచ్చాయి
యాక్షన్ డిసిప్లెయిన్ ఆపరేషన్ సిస్టమ్లో భాగంగా బాడీవార్న్ కెమెరాలు మంచి ఫలితాలనిచ్చేవి. పోలీసులు వెహికల్ చెకింగ్ చేసే టైమ్లో, డ్రంకన్ డ్రైవ్ టైమ్ లో బాడీ వార్న్ కెమెరాలను వాడేవారు. పాయింట్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్, ఎస్ఐ బాడీ వార్న్ కెమెరాలను ధరించేవారు. దీంతో చెకింగ్ టైమ్ లో వాహనదారులు, పోలీసుల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా గుర్తించేందుకు వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు పబ్లిక్తో దురుసుగా ప్రవర్తించే సిబ్బందిని ట్రేస్ చేయడంలో ఉన్నతాధికారులకు చాలా సందర్భాల్లో వెంటనే ఆధారాలు దొరకడం లేదు.