
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: బలవంతపు భూసేకరణ ఆపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ నుంచి భూనిర్వాసితులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ను ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బలవంతంగా భూసేకరణ చేయవద్దన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో రాంచందర్ రైతులను బెదిరించడం సరైంది కాదన్నారు.
20 గ్రామాలకు చెందిన రైతులు తరలివచ్చి, తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసనపల్లి రోడ్డులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, వివిధ సంఘాల నేతలు మచ్చేందర్, భీంరెడ్డి, అశోక్, జోషి, కాశప్ప, టి ధర్మరాజు, ఆంజనేయులు, సింగారం హనుమంతు, అంజప్ప పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు వినతి పత్రం అందజేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.