- రాష్ట్రంలో జీఎస్టీ, ఎక్సైజ్, మైనింగ్ రాబడిలో గణనీయమైన పెరుగుదల
- కొత్త సర్కారు వచ్చిన రెండో నెలకే రూ.200 కోట్లకు పైగా అదనపు ఇన్కం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంపై దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాబడికి గండి కొడుతున్న వాటికి క్రమంగా చెక్ పెడుతోంది. అందులో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్ను మరింత కట్టుదిట్టంగా వసూలు చేస్తున్నది. దీంతో జీఎస్టీ రాబడులు ప్రతినెలా వచ్చే యావరేజ్ కంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో నెలకే రూ.200 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చింది. జీఎస్టీ రిటర్న్లో గోల్ మాల్, ఎక్సైజ్వ్యాట్ ఇతరత్రా వంటి వాటిపై పకడ్బందీగా ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి రాబడి పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు.
మైనింగ్లోనూ ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వచ్చిన దానికంటే యావరేజ్ గా రోజుకు దాదాపు రూ.3 కోట్లు అదనంగా వస్తోంది. ఇసుక రీచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాకింగ్ ట్యాగ్లతో ఆదాయం పెరిగింది. ఎక్సైజ్ శాఖలోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం అమ్మకాలు, వ్యాట్ ఎగవేతలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. దీంతో ఎక్సైజ్లోనూ అదనంగా ఇన్కం పెరిగింది. ఇలా మూడు, నాలుగు శాఖల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నెలకు దాదాపు రూ.400 కోట్లపైనే ఇన్కం వస్తున్నట్లు తెలిసింది. కమీషన్లు, లంచాలు లేకుండా, అక్రమ మార్గంలో అప్పట్లో కొందరు లీడర్లకు సహకరించిన అధికారులను తప్పించడంతోనూ ఆదాయం పెరిగినట్టు సమాచారం.