
మార్చి 16న మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈసీ అధికారులు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న విధానాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక ఆలతో ఆయన చర్చించారు. సజావుగా కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈవో తెలిపారు. లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్, ఇతర విభాగాలన్నీ కోఆర్డినేట్ చేసుకుంటున్నాయన్నారు.
మార్చి 16న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు వికాస్ రాజ్. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి.. అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తామని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ దాదాపు గా 1300 ల మంది సిబ్బంది పాల్గొంటున్నారని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
కాగా, మార్చి 13న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరిగింది. హైదరాబాద్ లో మొత్తం 25 బూత్ లతో పాటు 139 పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ జరగగా.. రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బ్యాక్సులను సరూర్ నగర్ లోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.