
న్యూఢిల్లీ: పుట్టెడు నష్టాలతో ఇబ్బందిపడుతున్న తమను ఈ బడ్జెట్లో ఆదుకోవాలని టెలికం కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రూ. 32 వేల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను తిరిగి చెల్లించాలని, లైసెన్స్ ఫీజులను తగ్గించాలని రిక్వెస్ట్ చేస్తున్నాయి.. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్కు కంట్రిబ్యూషన్ వంటి లెవీలను తగ్గించాలని టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కోరుతోంది. ప్రభుత్వం తమను ఆదుకుంటే కంపెనీలను మరింత విస్తరించవచ్చని, లిక్విడిటీ పెరుగుతుందని తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్ 5జీని వేగంగా విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులను సులభతరం చేయడం కోసం టీఎస్పీల (టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు)కు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీనివల్ల టారిఫ్లు జనానికి అందుబాటులో ఉంటాయని సీఓఏఐ వివరించింది. ప్రస్తుతం, లైసెన్స్ ఫీజు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్)లో 8శాతం ఉంది. ఇందులో 5శాతం మొత్తాన్ని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్కు కేటాయిస్తారు. ప్రతి రూ.100లో రూ.30కి పైగా ప్రభుత్వానికి లెవీల రూపంలో చెల్లిస్తున్నట్లు టెల్కోలు చెబుతున్నాయి. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ (ఎస్యూసీ), స్పెక్ట్రమ్ చెల్లింపులపై జీఎస్టీని తొలగించే ప్రతిపాదనలను త్వరలో టెలికాం శాఖకు పంపనున్న బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరింది. టెలికాం టవర్కు ఇన్స్టాల్ అయిన టెలికాం పరికరాలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్కు సంబంధించి కూడా స్పష్టత కావాలని సీఓఏఐ కోరుతోంది. "పన్నుపై పన్ను"ను నివారించడానికి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఒక మెకానిజం. ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణల్లో భాగంగా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రస్తుత సంవత్సరం సెప్టెంబరులో ఈ టెలికం రంగానికి రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించారు. స్పెక్ట్రమ్, ఏజీఆర్ బకాయిలను నాలుగు సంవత్సరాలపాటు వాయిదా వేయడానికి అనుమతి ఇచ్చారు. టెల్కోలు బకాయిపడ్డ వడ్డీని ప్రభుత్వ ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఏజీఆర్ నిర్వచనాన్ని మార్చారు. లైసెన్స్ ఫీజులు, ఎస్యూసీ వంటి రెగ్యులేటరీ లెవీలు ఏజీఆర్ ఆధారంగా క్వార్టర్కు ఒకసారి చెల్లించడానికి అనుమతించారు. తక్కువ ఏజీఆర్ అంటే టెల్కోలు తక్కువ లెవీలు చెల్లిస్తాయి. 2021 తెచ్చిన సంస్కరణల్లో భాగంగా భవిష్యత్తులో స్పెక్ట్రమ్ వేలంలో పొందే ఎయిర్వేవ్ల కోసం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా, టెల్కోల మొత్తం ఎస్యూసీ చెల్లింపు ఏజీఆర్లో 1శాతం కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది.
టారిఫ్స్ తగ్గించాలని కోరిన ఐసియా
ఎలక్ట్రానిక్స్ప్రొడక్టులపై అడ్డగోలుగా వసూలు చేస్తున్న టారిఫ్లను, పన్నులను మార్చాలని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మొబైల్ ఫోన్స్, సబ్–అసెంబ్లీస్, మెకానిక్స్పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్అసోసియేషన్(ఐసియా) కేంద్రాన్ని కోరింది. ఖరీదైన ఫోన్ల స్మగ్లింగ్ను నివారించడానికి వాటిపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించాలని కోరింది. ఒక్కో డివైజ్కు రూ.నాలుగు వేల చొప్పున వసూలు చేస్తే జీఎస్టీ వసూళ్లు అదనంగా రూ.వెయ్యి కోట్లు పెరుగుతాయని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో టారిఫ్ విధానం మార్చాలని ఐసియా కోరింది. ఎక్కువ టారిఫ్స్ వల్ల ఎలక్ట్రానిక్స్వస్తువుల తయారీలో వియత్నాం, థాయ్లాండ్, మెక్సికో వంటి దేశాలతో పోలిస్తే వెనుకబడుతున్నామంది.