యునైటెడ్ నేషన్స్/జెనీవా: కరోనా కేసుల నమోదుపై వాస్తవాలు వెల్లడించాలని చైనాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. కఠినమైన ‘‘జీరో కొవిడ్ పాలసీ’’ సడలించడంతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులతో డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్షించారు. కరోనా విషయంలో తప్పుడు లెక్కలు ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్వో సూచించింది. అబద్ధాలు ప్రచారం చేయడంతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనిటిక్ సీక్వెన్సింగ్, కరోనాతో హాస్పిటల్స్తో చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడించాలని కోరింది.
వైరస్ వేరియంట్లతో పాటు రోగులకు అందిస్తున్న ట్రీట్మెంట్, వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు చెప్పాలని సూచించింది. ముఖ్యంగా 60ఏండ్లు పైబడిన రోగుల పరిస్థితేంటో వివరించాలని తెలిపింది. వైరల్ సీక్వెన్సింగ్, క్లినికల్ మేనేజ్మెంట్, ఇంపాక్ట్ అసెస్మెంట్ను బలోపేతం చేయాలని సూచించింది. కరోనాకు సంబంధించి డబ్ల్యూహెచ్వో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో కలిసి పనిచేయాలంటూ చైనా సైంటిస్టులను కోరింది. నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి: ఈయూ దేశాలు చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో యూరోపియన్ దేశాలు అలర్ట్ అయ్యాయి. చైనా నుంచి వచ్చేటోళ్లు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందేనని ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ దేశాలు ఆంక్షలు విధించాయి.