అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దోపిడీ దొంగల దాడిలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ కొలంబస్లో అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లా ఆశోక్ నగర్ నివాసి వీర సాయిష్ (24) ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్, 1000 వెస్ట్ బ్రాడ్ స్ట్రీట్ లోని షెల్ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న వీర సాయిష్ పై దోపిడి దొంగలు దాడిచేశారు. 

ఆ టైంలో సాయిష్.. దోపిడీ దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. దోపిడిలో దుండగులు సాయిష్ నుంచి నగదు ఎత్తుకెళ్లారు. సాయిష్ తండ్రి మరణానంతరం 2021లో సాయిష్.. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాడు. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇంతలో అతడి మృతి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.