దుబ్బాక లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

దుబ్బాక లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి అక్బర్ పేట్ మండలంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తహశీల్ధార్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా తహశీల్ధార్ ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చారు. ఈ సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. తమ కృషి వల్లే భూంపల్లి అర్బర్ పేట్ మండలం ఏర్పాటు అయింబదని రెండు పార్టీల కార్యకర్తల స్లోగన్స్ ఇచ్చారు. రఘునందన్ రావు కృషితోనే మండలం, తహశీల్ధార్ ఆఫీస్ నిర్మాణం అయిందంటూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తహశీల్ధార్ ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. 

అంతకు మునుపు భూంపల్లి, అక్బర్ పేట్ కొత్త మండలాలుగా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కుక్కనూర్ పల్లి, నిజాంపేట్, భూంపల్లిలను కొత్త మండలంగా కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడగగానే అనుమతి ఇచ్చారని చెప్పారు. ఉచిత విద్యుత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నందుకు కేంద్రం ఓర్వలేకపోతుందని, అందుకే నిధులు ఆపేసిందని ఆరోపించారు. ప్రతి పనిని తానే మంజూరు చేశానని రఘునందన్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. గొప్పలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపణలు చేశారు.