- జాయింట్ ఆపరేషన్లో మట్టుబెట్టిన ఆర్మీ
శ్రీనగర్: పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం మట్టుబెట్టింది. సౌత్ కాశ్మీర్లోని ట్రాల్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టును జాయింట్ ఆపరేషన్లో ఎన్కౌంటర్ చేశామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరికొంత మంది టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి ఇప్పటి వరకు మూడు ఎన్కౌంటర్లు జరిగాయని అన్నారు. పోయిన ఏడాది పుల్వామాలో జరిగిన ఎటాక్ తరహా ప్లాన్ను మన సెక్యూరిటీ సిబ్బంది తిప్పికొట్టింది. 42 కేజీల పేలుడు పదార్థాలతో వచ్చిన కారును పట్టుకుంది. కాగా.. అప్పటి నుంచి పాకిస్తాన్ ఎల్వోసీ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సీజ్ఫైర్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతూనే ఉంది. సోమవారం ఉదయం పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు దిగిందని, దాన్ని మన ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు చెప్పారు. ఆదివారం కూడా జమ్మూకాశ్మీర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో కాల్పులకు తెగబడింది.