కోల్కతా: ఇండియాలో టెస్టు మ్యాచ్లను కోల్కతా, చెన్నై వంటి సంప్రదాయ కేంద్రాలకే పరిమితం కాకుండా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు నిర్వహించాలని కోరుకుంటున్నప్పటికీ.. గువాహతి, రాంచీ వంటి నగరాలకూ ఈ ఫార్మాట్ విస్తరించడం చాలా సంతోషకరమన్నాడు.
2026–27 హోమ్ సీజన్ షెడ్యూల్లో భాగంగా ఆస్ట్రేలియాతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ఆతిథ్య నగరాల జాబితా నుంచి కోల్కతా, ముంబైని బీసీసీఐ మినహాయించింది. నాగ్పూర్, చెన్నై, గువాహతి, రాంచీ, అహ్మదాబాద్కు ఈ మ్యాచ్లను కేటాయిస్తూ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి దాదా మద్దతిచ్చాడు.
‘ఈడెన్లో పెద్ద మ్యాచ్లు జరగాలని కోరుకోవడం సహజం, గతంలో ఇక్కడ సౌతాఫ్రికాతో టెస్ట్, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మనకు కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతర నగరాలకూ అవకాశం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. దేశంలో అన్ని స్టేడియాల్లో మెరుగైన వసతులు ఉన్నాయి’ అని గంగూలీ పేర్కొన్నాడు.
ఇక, 2001లో ఆస్ట్రేలియాపై హిస్టారికల్ టెస్ట్ విక్టరీలో భాగమైన నాటి ఇండియా క్రికెటర్లతో ఈడెన్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దాదా వెల్లడించాడు.
