
భువనేశ్వర్: ప్రపంచదేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తుంటుంది. అగ్రరాజ్యంగా అమెరికా చలామణి అవుతోంది. అలాంటి దేశ అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందితే ఏ దేశాధినేత అయినా కూడా సాధారణంగా తిరస్కరించారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పారు. అది కూడా దేవుడి దర్శనం కోసం అంట.
శుక్రవారం (జూన్ 20) ప్రధాని మోడీ ఒడిషాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18,600 కోట్ల విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. "ఒడిశా విజన్ డాక్యుమెంట్"ను ఆవిష్కరించారు. అలాగే పలు కొత్త రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లా. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేశారు. వాషింగ్టన్ సందర్శించి, కలిసి విందు చేయమని ఆహ్వానించారు. కానీ ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించా. ఎందుకంటే.. ఒడిశా పర్యటన షెడ్యూల్లో ఉందని చెప్పా. ట్రంప్ ఆతిథ్యం కంటే నాకు ఒడిషాలోని జగన్నాథుడి దర్శనమే ముఖ్యం’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన, ప్రజా సేవలతో విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసిందని.. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజని ప్రధాని మోడీ అన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం మాత్రమే కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవమని అభివర్ణించారు. ఏడాదిలో ప్రజలకు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి మోహన్ మాఝి, ఆయన మొత్తం బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు. కాగా, 2024 జూన్ లో జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని మట్టికరిపించి.. ఒడిషా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.