- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై బాల్క సుమన్, బీఆర్ఎస్ లీడర్లు రాళ్లు వేశారు: మంచిర్యాల డీసీపీ భాస్కర్
- సుమారు 500 మందితో కలిసి దాడి చేశారు
- బాల్క సుమన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశాం
- సీసీ ఫుటేజీల ఆధారంగా మిగతా వారినీ గుర్తిస్తామని వెల్లడి
కోల్బెల్ట్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సుమారు 500 మంది బీఆర్ఎస్ నాయకులు క్యాతనపల్లికి వచ్చి మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టించారని మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్పారు. ఈ నెల 17న క్యాతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై జరిగిన దాడి వివరాలను శనివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్తో కలిసి మీడియాకు డీసీపీ వివరించారు. ‘‘ఈ నెల 16న క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా 300 మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చారు.
ఇది ఎలక్షన్ రూల్స్కు విరుద్ధమని పోలీసులు అడ్డుకోవడంతో బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఎలక్షన్అధికారులు చైర్ పర్సన్ ఎన్నికను వాయిదా వేశారు. 17న నిర్వహించే ఎన్నికకు ఇరు పార్టీల కౌన్సిలర్లు మూడు వెహికల్స్లో మాత్రమే రావాలని సూచించాం. అయితే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బాల్క సుమన్తో పాటు మరో 500 మంది బీఆర్ఎస్ లీడర్లు మున్సిపల్ ఆఫీస్కు వెళ్లేందుకు ప్రయత్నించారు.
వారిని అడ్డుకొని మూడు వెహికల్స్కు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పాం. అదే సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ వెళ్తుండగా.. బాల్క సుమన్తో పాటు వందలాది మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు వాళ్ల వెహికల్స్పై రాళ్లు రువ్వారు”అని డీసీపీ తెలిపారు. బీఆర్ఎస్ లీడర్ల రాళ్ల దాడిలో పోలీసులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు.
జైపూర్ ఏసీపీ గన్మన్ రాకేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో అతడు ప్రస్తుతం సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని.. ఇప్పటివరకు బాల్క సుమన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారిని సైతం గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
పోలీస్ శాఖ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లలకు తలొగ్గదని, రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్స్నే పాటించినట్టు స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. ఆయన వెంట మందమర్రి సీఐ పర్స రమేశ్, రామకృష్ణాపూర్ ఎస్సై జె.శ్రీధర్ ఉన్నారు.
