
రాణీ రుద్రమదేవి జీవితకథ సీరియల్ రూపంలో బుల్లితెరపై ప్రసారం కానుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కథను స్టార్మా చానెల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. యువరాణిగా రాజకుటుంబంలో జన్మించిన రుద్రమ, యువరాజుగా జీవితం సాగించడంతో పాటుగా శిక్షణ పొందుతూ సింహాసనాన్ని దుష్టశక్తుల బారినపడకుండా కాపాడుతుంది. ప్రజాపరిపాలనకు సంబంధించిన జ్ఞానాన్ని ఆమె తన తండ్రి గణపతిదేవుని నుంచి నేర్చుకున్నారు రుద్రమ. ఇదివరకే ఈ చరిత్రను వెండితెరపై దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవిగా తెలుగు ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు అదే కథను ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సీరియల్ గా చూపించనున్నారు. ఈ ధారావాహిక కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కృషి చేస్తున్నారు. దీక్షగా పనిచేస్తున్నారు. ఈ ధారావాహిక ‘స్టార్ మా’ లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.