
నారాయణ్ఖేడ్, వెలుగు : ప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీతోనే ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో తాగు, సాగు నీటి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నారాయణ్ఖేడ్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిరుద్యోగం, వలసలు తగ్గించేందుకు ఫ్యాక్టరీలు పెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీ స్వార్థం కోసం బీసీ రిజర్వేషన్ల ఆమోదానికి అడ్డుపడుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో దోషి ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నరసింహ, మంద పవన్, ప్రకాశ్రావు, ఆనంద్, సయ్యద్ జలాలుద్దీన్, రహమాన్, తాజొద్దీన్, దత్తురెడ్డి, మహబూబ్ఖాన్, రుబీనా, చిరంజీవి, పుప్పాల అశోక్, ఇసాక్ పాల్గొన్నారు.