ఆగస్టు 16న యూనివర్శిటీల బంద్కు కాంట్రాక్ట్ అధ్యాపకుల పిలుపు

ఆగస్టు 16న యూనివర్శిటీల బంద్కు కాంట్రాక్ట్ అధ్యాపకుల పిలుపు

తమ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు మండిపడ్డారు. తమను రెగ్యూలర్ చేయాలని మూడు నెలలుగా ప్రభుత్వాన్ని అడుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. డిమాండ్లను నెరవేర్చాలని ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు చేసినా..నిరసనలు తెలిపినా కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదన్నారు.

కాంట్రాక్ట్ టీచర్స్ అధ్యాపకుల జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం (ఆగస్టు 14న) రోజు సమావేశమైంది. తమ భవిష్యత్తు కార్యాచరణపై అధ్యాపకులు చర్చించారు. తమకు అనుకూలంగా ఉంటున్నామని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం సవిత తల్లి ప్రేమ చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  తమను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ తో ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల బంద్ కు పిలుపునిస్తున్నామని ప్రకటించారు. 

తమకు అన్ని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు మద్దతు తెలుపాలని కోరారు. ఆగస్టు 19, 20 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాదీక్ష పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ దీక్షకు అన్ని యూనివర్శిటీల నుండి  14 వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే.. తమ కుటుంబాలతో సహా దీక్షలు చేపడతామని హెచ్చరించారు.