
రాంచీ: ఎన్నికల ఖర్చు రూ.60వేల కోట్లు దాటిన దేశంలో ఆకలిచావులు ఇంకా ఆగలేదు. బుక్కెడు బువ్వ దొరక్క మరో బడుగుజీవి ప్రాణాలు విడిచాడు. ఇండియాలోని 40 శాతం మినరల్స్ని తనలో దాచుకున్న జార్ఖండ్లోనే జరిగిందీ సంఘటన. లోహర్దగా జిల్లా లుర్గుమికాలా గ్రామానికి చెందిన రాంచరణ్ ముండా(65) గురువారం కన్నుమూశాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. మూడ్రోలుగా ఏమీ తినకపోవడం వల్లే అతను చనిపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు. రేషన్ కార్డు ఉన్నా బయోమెట్రిక్ మెషీన్ పనిచేయకపోవడంతో మూడు నెలలుగా సరుకులు అందట్లేదని, చుట్టుపక్కలవాళ్లిచ్చిన పిండితో రోజులు నెట్టుకొచ్చామని, చివరి మూడురోజులు ఏమీ దొరక్క ఇంట్లో పొయ్యి కూడా వెలిగించలేదని రాంచరణ్ కూతురు మీరా కుమారి చెప్పింది. తండ్రి చావు జరిపించడానిక్కూడా పైసల్లేవని కన్నీటిపర్యంతమైంది.
రేషన్ షాపులో బయోమెట్రిక్ మెషీన్ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లుర్గుమికాలా వాసులు తెలిపారు. ఆహార హక్కు కార్యకర్తల లెక్కల ప్రకారం జార్ఖండ్లో గత నాలుగేండ్లలో చోటుచేసుకున్న 17వ ఆకలిచావు ఇది. తిండిలేక ప్రాణాలు కోల్పోయినవారంతా పేదగిరిజనులే. అయితే వాళ్లంతా ఆకలితో కాదు.. అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రయాసపడుతుంటారనే ఆరోపణలున్నాయి. రాంచరణ్ విషయంలోనూ అదే జరిగింది. అతనో తాగుబోతని, మద్యం కారణంగానే చనిపోయాడని లోకల్ ఆఫీసర్లు తేల్చేశారు. ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డు, పెన్షన్ లబ్దిదారుల జాబితాలో రాంచరణ్ కుటుంబం కూడా ఉందన్న జిల్లా కలెక్టర్ సుధీర్ కుమార్.. బయోమెట్రిక్ మెషీన్పై గ్రామస్తులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆన్లైన్ సదుపాయం లేకుంటే ఆఫ్లైన్లోనైనా సరుకులు పంచాలని ఆదేశించామని, కొంతమంది డీలర్లు వాటిని పాటించడంలేదని, అలాంటివాళ్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. గతేడాది నవంబర్లో దుమ్కా జిల్లాకు చెందిన కాళేశ్వర్ సోరెన్(45), అంతకుముందు సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏండ్ల బాలిక ఆకలితో ప్రాణాలు కోల్పోయారు.