
హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్మెంట్స్ భూములు, ఖాళీ స్థలాలను రక్షించుకోవడానికి ఆ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ ల్యాండ్స్ను జియో ఫెన్సింగ్ చేస్తూ డిజిటల్ మ్యాపింగ్ చేశారు. ఈ సిస్టమ్తో పనిచేసే వెబ్ అప్లికేషన్ ను డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ సహా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జియో స్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ ల్యాండ్స్, ప్రాపర్టీలను డిజిటల్ రికార్డ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 54 యూనిట్లకు చెందిన 953 ఆస్తులను జియో స్పేషియల్ అప్లికేషన్తో ట్యాగ్ చేశామని అన్నారు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ తో కలిసి అత్యంత ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
జీఐఎస్ విధానంతో స్కెచ్ మ్యాప్ల లింక్
మొదటి దశలో భూములకు సంబంధించి స్కెచ్ మ్యాప్లు జీఐఎస్ విధానంతో కనెక్ట్ చేయనున్నట్లు మహేందర్రెడ్డి తెలిపారు. రెండో దశలో ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలోని భూములను గుర్తించడానికి హై -రెజల్యూషన్ శాటిలైట్ మ్యాప్స్ చేస్తామన్నారు. మూడో దశలో ఈ జియో- రిఫరెన్స్ చేసిన ల్యాండ్ పార్సెల్స్, రెవెన్యూ రికార్డులను టౌన్ సర్వే మ్యాప్లతో అనుసంధానం చేస్తామన్నారు. ఈ సిస్టమ్లో పోలీస్ శాఖకు చెందిన భూములు, ప్రాపర్టీస్ వాటి విస్తీర్ణాలను జియో -స్పేషియల్ డేటాబేస్ రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఎస్పీఎల్ఐఎస్) ద్వారా లాగిన్, పాస్వర్డ్తో అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో అందుబాటులో ఉంటాయని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.