ముఖం మీద వచ్చే మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడతారు చాలామంది. ఎండలో బయటికి వెళ్తే చాలు టాన్ సమస్య వస్తుంది కొందరికి. ఫేస్క్రీమ్స్ రాసుకున్నా కూడా ఫలితం ఉండదు. అలాంటప్పుడు బ్యూటీ రొటీన్లో ముల్తానీ మట్టిని చేర్చాలి. ఈ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందులోని మినరల్స్ ముఖం మీది చర్మం ఒకే రంగులో కనిపించేలా చేస్తాయి. అంతేకాదు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుతాయి.
ముల్తానీ మట్టిలో కొన్ని నీళ్లు లేదా రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసుకుని 10– 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలాచేస్తే ఎండాకాలంలో వచ్చే టాన్ తగ్గుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ముల్తానీ మట్టి ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.
ఈ మట్టి సెబంను పీల్చుకోవడమే కాకుండా జిడ్డు, చర్మం మీది మలినాల్ని పోగొడుతుంది. అంతేకాదు డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మాన్ని ఫ్రెష్గా చేస్తుంది.
ముల్తానీ మట్టి, అలొవెరా జెల్ ఫేస్ప్యాక్ కూడా ముఖాన్ని మెరిపిస్తుంది. టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అలొవెరా జెల్ కలిపి ఫేస్ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాలు
అలాగే ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.