- ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్ట్
హైదరాబాద్, వెలుగు: బీటెక్ తర్వాత బీఈడీ చేసిన–వాళ్లను డీఎస్సీకి ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. వీళ్లను డీఎస్సీ రాసేందుకు అనుమతించాలని రెండేళ్ల కిందట ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. దీనిపై కోర్టుకు వివరణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల నియామక బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) చైర్మన్ రోనాల్డ్ రాస్ వ్యక్తిగతంగా అటెండ్ అవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల బెంచ్ ఆదేశాలిచ్చింది. బీటెక్ వాళ్లకు బీఈడీ చేసేందుకు 2015లో పర్మిషన్ లభించింది. దీంతో బీటెక్–బీఈడీ చేసిన వాళ్లను డీఎస్సీకి అనుమతివ్వకపోవడంతో కొందరు రిట్ పిటిషన్స్ వేశారు. వాటిని విచారించిన కోర్టు 2019లో బీటెక్-–బీఈడీ వాళ్లనూ డీఎస్సీకి అనుమతించాలని తీర్పు చెప్పింది. దీనిని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో, కొందరు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తమ ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.