ఢిల్లీలో భారీ వర్షాలు.. హస్తినకు పొంచి ఉన్న మరో ముప్పు

ఢిల్లీలో భారీ వర్షాలు.. హస్తినకు పొంచి ఉన్న మరో ముప్పు

వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం.

దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో యమునా నదికి వరద పోటెత్తింది. నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. 

హస్తినకు మరో ముప్పు పొంచిఉంది. రెండు రోజుల్లో ఢిల్లీని భారీ వరద తాకనుంది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది.
హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం హత్నికుండ్‌ బ్యారేజీ గేట్లను ఎత్తివేసింది. రెండు రోజుల్లో ఢిల్లీని తాకనుంది. అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుంది. నగరంలోని ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తెలిపింది. బ్రిడ్జి ప్రమాద స్థాయి 204.5 మీటర్లు అని అధికారులు తెలిపారు.

హర్యానా నుంచి వచ్చే నీరు యమునా నదిలో కలిస్తే వరద ప్రవాహం 205.5 మీటర్లకు చేరుకుంటుందని చెప్పారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు 16 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

దేశ రాజ‌ధానిలో 41 ఏండ్ల గ‌రిష్టస్ధాయిలో వ‌ర్షపాతం న‌మోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153 ఎంఎం వ‌ర్షపాతం న‌మోద‌వ‌డంతో 1982 త‌ర్వాత ఈ స్ధాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం ఇదే తొలిసారని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఢిల్లీలో ఇదే అత్యధిక వ‌ర్షపాతమ‌ని అధికారులు తెలిపారు. భారీ వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌టంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాల‌ని ఐఎండీ య‌ల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాలతో ఢిల్లీలోని పార్కులు, అండ‌ర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిట‌ల్ ప్రాంగ‌ణాలు, మాల్స్ స‌హా వాణిజ్య సంస్ధల ప్రాంగ‌ణాలు నీట‌మునిగాయి. భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ వీధుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప్రయాణీకులు, పాద‌చారులు మోకాలి లోతు నీళ్లలో గ‌మ్యస్ధానాల‌కు చేరుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.