
దేశవ్యాప్తంగా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన "ది కేరళ స్టోరీ" మూవీ మే 5న విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి వసూళ్లనే రాబట్టింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన ఆదా శర్మ తో పాటు మిగిలిన నటీనటులు సైతం విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇక తమ చిత్రానికి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అదా శర్మ కృతజ్ఞతలు తెలిపింది. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది. "నా నిజాయతీని కొందరు అపహాస్యం చేశారు. మా చిత్తశుద్దిని చులకనగా చూశారు. 'ది కేరళ స్టోరీ టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాను రిలీజ్ చేయొద్దని బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశాయి. అయినా కూడా ప్రేక్షకులు అవేమి పట్టించుకోలేదు. మాకు భారీ విజయాన్ని అందించారు. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇంతగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఈ మూవీ విషయంలో ఆడియన్స్ గెలిచారు" అని రాసుకొచ్చింది అదా శర్మ.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని లవ్ జిహాద్, ఐసిస్ రిక్రూట్ మెంట్, లైంగిక బానిసత్వం వంటి వివాదాస్పద అంశాల ఆధారంగా తెరకెక్కింది.