డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని స్టూడెంట్ సంఘాల లీడర్లు స్పష్టం చేశారు. ఆదివారం క్యాంపస్లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. గర్ల్స్ హాస్టట్లోకి ప్రైవేట్ వ్యక్తులను తీసుకెళ్లి వీసీ రవీందర్గుప్తా డ్యాన్స్లు చేసి డబ్బులు పంచారని ఆరోపించారు. దీనిపై నిరసన తెలిపినందుకు కేసులు పెడతామని వర్సిటీ ఆఫీసర్లు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. స్టూడెంట్సంఘాల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనివర్సిటీ పరువును కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. స్టూడెంట్లీడర్లు శివ, గజేందర్, సంతోష్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వీసీపై అసభ్య పదజాలంతో స్టూడెంట్లీడర్ సంతోష్ ప్రకటన విడుదల చేశాడని అతడిపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ విద్యావర్ధిని ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?బ్రిడ్జి రిపేర్ కోసం కాంగ్రెస్ ఆందోళన
కామారెడ్డి, వెలుగు: బ్రిడ్జి శిథిలావస్థకు చేరి వాగులో పడి అనేక మంది చనిపోతున్నా.. రిపేర్లు చేపట్టడం లేదని.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా.? అని కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్రెడ్డి, పొసానిపేట సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. బ్రిడ్జికి రిపేర్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వారు గంగమ్మ వాగు బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అనేక మంది ఇక్కడ వాగులో పడి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఓ కారు పడి ఒకరు చనిపోయారన్నారు. దాదాపు రోడ్డుపై గంటకు పైగా వర్షంలోనే బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అరెస్టు చేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్కు తరలించారు. తక్షణమే ఆఫీసర్లు స్పందించి బ్రిడ్జికి రిపేర్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు భాగయ్య, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1995-–96లో టెన్త్ పూర్తి చెసుకున్న స్టూడెంట్లు ఆదివారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పూర్వ విద్వార్థులు సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. అంతకుముందు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు, దోస్తుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పట్టణ సర్పంచ్ తునికి వేణు, రామేశ్వరపల్లి సర్పంచ్ నాగర్తి పోతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బల్ల శ్రీనివాస్, గంగల శ్రీనివాస్, నవీన్, నాగభూషణం, భిక్షపతి, ప్రభాకర్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా.. బీజేపీ రాష్ట్ర కమిటీ మెంబర్ రచనారెడ్డి
ఎల్లారెడ్డి, వెలుగు: వీఆర్ఏ సమస్యలపై పోరాటం చేస్తున్న బీజేపీ లీడర్లపై ఎల్లారెడ్డి పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం విడ్డురంగా ఉందని బీజేపీ రాష్ట్ర కమిటీ మెంబర్ రచనారెడ్డి అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండల్ సోమర్పేట్లో బీజేపీ కార్యకర్త సాయిబాబాను స్థానిక లీడర్లతో కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వీఆర్ఏ అశోక్ మృతిపై నిరసన తెలిపిన బీజేపీ లీడర్లపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. న్యాయవాద పరంగా తాను అండగా ఉంటానని తెలిపారు. అనంతరం వీఆర్ఏలు సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రాంగణానికి చేరుకుని వారికీ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు దేవేందర్, బాలకిషన్, రాజేశ్, సతీశ్ పాల్గొన్నారు.
సాయం చేసేందుకు వెళ్లి..యాక్సిడెంట్లో వ్యక్తి మృతి
కామారెడ్డి, వెలుగు: యాక్సిడెంట్కు గురైన వ్యక్తులకు సాయం చేసేందుకు ప్రయత్నించి మరో వెహికల్ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా వెల్మల్ మండలం బొప్పాలకు చెందిన గాల విక్రం (32) తన స్నేహితుడు ప్రవీణ్రెడ్డితో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్లి .. తిరిగి తమ సొంతూరుకు వెళ్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో టెకిర్యాల్ శివారులో నేషనల్ హైవేపై శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. బైక్లపై ఉన్న వ్యక్తులు కింద పడ్డారు. కారులో నిర్మల్ వెళ్తున్న విక్రం, ప్రవీణ్రెడ్డి యాక్సిడెంట్ను చూసి ఆపి కింద పడిన వారి దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తమకు పెద్దగా గాయాలు కాలేదని తాము వెళ్తామని చెప్పడంతో వీరు తమ కారు వైపు వెళ్తుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన విక్రం చనిపోగా, ప్రవీణ్రెడ్డికి గాయాలయ్యాయి. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్లో స్టూడెంట్ చనిపోయినా కనికరించరా..?
కోటగిరి, వెలుగు: బీర్కూర్ బీసీ హాస్టల్లో విద్యార్థి చనిపోతే కనికరం లేకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని బాన్సువాడ బీజేపీ ఇన్చార్జి మాల్యాద్రిరెడ్డి మండిపడ్డారు. పాము కాటుతో స్టూడెంట్ చనిపోయి రెండు రోజులు అవుతున్నా స్పీకర్ ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని బీజేపీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్టళ్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. కనీసం 50 ఏండ్లు సర్వీస్ ఇవ్వాల్సిన ఆర్సీసీ బిల్డింగ్లు నాణ్యతా లోపంతో కేవలం ఏడేండ్లకే అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు. చెట్లు, ముళ్లపొదలతో బీర్కూర్లో బీసీ హాస్టల్ అడవిని తలపించేలా ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో స్టూడెంట్ పాము కాటుతో చనిపోయాడని ఆరోపించారు. చనిపోయిన స్టూడెంట్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు శ్రీనివాస్, చందూరి హన్మాండ్లు, నాగెల్లి సాయికుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏటీఎంలో చోరీకి యత్నం
పిట్లం, వెలుగు: మండల కేంద్రంలో రెండు ఇండియా వన్ ఏటీఎంలలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. శనివారం రాత్రి ఏటీఎంలను ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో చోరీ విషయం గుర్తించలేదు. ఎస్సై రంజిత్ మాట్లాడుతూ పిట్లం బస్టాండ్, హైదరాబాద్ రోడ్డులోని రెండింటిలో చోరీ యత్నం జరిగినట్లు తెలిపారు. ఏటీఎంలు ధ్వంసం చేసినా ఎలాంటి నగదు పోలేదని పేర్కొన్నారు. ఏటీఎంల నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
రెడ్ క్రాస్ను సందర్శించిన ఈవీ
నిజామాబాద్ టౌన్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు, ఈవీ శ్రీనివాస్ ఆదివారం నగరంలోని సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, తర్వాత నిజామాబాద్ రెడ్ క్రాస్ సేవలో ముందు వరుసలో నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ సేవలు ఇలాగే కొనసాగాలన్నారు. ఇదే జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్రపతి అవార్డులు దక్కడం గొప్ప విషయం అన్నారు.
సీపీని కలిసిన సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు ఆదివారం పోలీస్ కమిషనర్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఆంజనేయులు, సభ్యులు తోట రాజశేఖర్, రామచందర్, రవీందర్ పాల్గొన్నారు.
వీఆర్ఏలను అరెస్టు చేసిన పోలీసులు
సిరికొండ, వెలగు: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మహత్య చేసుకున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ వీఆర్ఏ వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు వెళ్తున్న సిరికొండ వీఆర్ఏలను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ ఏలు మాట్లాడుతూ పే స్కేల్ వస్తుందో లేదోనని బెంగతో ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డకోవడం తగదన్నారు. సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో వీఆర్ఏల మండల అధ్యక్షుడు దత్తత్రేయ, ఉపాధ్యాక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి గంగాధర్, తిరుపతి, లింగం, సాయిలు ఉన్నారు.
పేదల్లో ఆత్మగౌరవం నింపాం
కామారెడ్డి, వెలుగు: పేదల్లో ఆత్మగౌరవం నింపింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి టౌన్లోని పలు వార్డులకు కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ ఉర్దూ ఆకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా లైబ్రరీ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్లు ముప్పారపు అపర్ణ, గెరిగంటి స్వప్ప, కొయల్కర్ కన్నయ్య, పిట్ల వేణు, హఫీజ్బేగ్, చాట్ల రాజేశ్వర్, భాస్కర్గౌడ్, లీడర్లు వేణుగోపాల్రావు, ప్రభాకర్రెడ్డి, పిప్పిరి వెంకటి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
భార్యను హత్య చేసిన భర్త
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్యపై అనుమానంతో భర్త చున్నీతో ఉరి బిగించి హతమార్చాడు. శనివారం రాత్రి నిజామాబాద్ టౌన్లో జరిగిన ఈ ఘటన వివరాలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ విజయబాబు కథనం ప్రకారం.. మాలపల్లికి చెందిన సయ్యద్ సుల్తాన్తో అదే కాలనీలో ఉంటున్న అనీస్ ఫాతిమా(30)కు 2013లో పెళ్లి అయ్యింది. వీరికి కూతురు సైరత్ ఫాతిమా (8), కొడుకు సయ్యద్ రియన్(5) ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి భర్త, అత్తల వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక బయటకు వచ్చిన ఆమె నెలన్నర కింద మూడో పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. అయినా కూడా భర్త ఆమెను ఫోన్లో వేధింపులుకు గురి చేయడం, ఇంటి వచ్చి గొడవలు చేయడం మానలేదు. శనివారం రాత్రి ఇంటికి వెళ్లిన సయ్యద్ పిల్లలను ఆడుకోమని బయటికి పంపి భార్యను చున్నీతో హతమార్చాడు. తర్వాత పిల్లలను తీసుకుని వెళ్లాడు. మృతురాలి తండ్రి సయ్యద్ కలీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసినట్లు ఎస్సై విజయబాబు వివరించారు.