కరోనా టీకా ఓ మత్తు మందు.. నేను వేసుకోను

కరోనా టీకా ఓ మత్తు మందు.. నేను వేసుకోను

ప్రపంచంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ సారి ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ దేశాలను భయపెడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులో ఇండియాలో 21 నమోదయ్యాయి. దాంతో వ్యాక్సినేషన్ లో అధికారులు వేగం పెంచారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి వ్యాక్సిన్ వేయడానికి ఆశా వర్కర్లు వెళ్తే.. ఊరైనా విడిచిపోతా కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని తెగేసి చెప్పాడు. ఈ వింత ఘటన సోమవారం, డిసెంబర్ 6న జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రొండి ఎల్లయ్య అనే వ్యక్తి ఇంకా ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. దాంతో ఆశావర్కర్లు టీకా వేయడానికి వెళ్లగా.. ఎల్లయ్య నిరాకరించాడు. వెంటనే ఆశావర్కర్లు సర్పంచ్ కు తెలియజేశారు. వెంటనే సర్పంచ్ భర్త బింగి వేణు అక్కడకు వచ్చి.. టీకా వేయించుకోవాలని కోరాడు. అయితే ఎల్లయ్య మాత్రం కరోనా టీకా ఓ మత్తు మందు అని.. అది నన్ను బలవంతంగా వేసుకోమంటే ఊరు విడిచి వెళ్లిపోతానని మొండికేశాడు. ఎంతచెప్పినా వినకపోవడంతో.. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంటికి గొళ్లెం పెట్టి ఎక్కడకో వెళ్లిపోయాడు.