హైదరాబాద్, వెలుగు : దళిత అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అందాల్సిన నిధులను సర్కారు పక్కదారి పట్టిస్తున్నదన్న ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. గురువారం రాష్ట్ర సర్కారుకు నోటీసులిచ్చింది. నిధుల మళ్లింపుపై విచారణకు ఆదేశించింది. నిజానిజాలను విచారించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్సీ కమిషన్ఆదేశించింది. కాగా అట్రాసిటీ కేసుల్లో దళితులకు అందించాల్సిన మానిటరీ రిలీఫ్ అండ్ లీగల్ ఎయిడ్ నిధులను రాష్ట్ర సర్కారు పక్కదారి పట్టిస్తున్నదని జాతీయ ఎస్సీ కమిషన్కు నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
కేంద్రం వాటా రూ.5.36 కోట్లకు తోడు రాష్ట్ర సర్కారు తన వాటానూ విడుదల చేసిందని, బాధితులకు అందించాల్సిన మొత్తం రూ.12.72 కోట్ల ను సర్కారు పక్కదారి పట్టించిందని ఫిర్యాదులో రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో వేయాల్సిన సొమ్మును వేరే అవసరాలకు ప్రభుత్వం మళ్లించిందన్నారు. నిధులను దారి మళ్లించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎస్కు జాతీయ ఎస్సీ కమిషన్నోటీసులు జారీ చేసింది. .