
కర్నాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ను ఉపయోగించుకుంటోంది.
ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఈసారి మోడీ ఛర్మిష్మాను నమ్ముకున్న కర్నాటక బీజేపీ.. ఆయన కేంద్రంగానే ప్రచారం ముమ్మరం చేస్తోంది. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలాసార్లు కర్నాటకలో పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉంటే.. ట్రిపుల్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిందీ మూవీ. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఆస్కార్ అందుకున్న చిత్రంగా ట్రిపులార్ నిలిచింది. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమే ఫిదా అయ్యింది.
ఈ పాట కర్నాటక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన ‘నాటు నాటు’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొంతమంది యువకులు డ్యాన్స్ చేస్తున్న పాట నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కర్ణాటకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన, ప్రాజెక్టులు, పథకాల పేర్లను ఈ పాటలో ప్రస్తావించారు.
శివమొగ్గ ఎయిర్ పోర్ట్ , బెంగళూరు మైసూర్ ఎక్స్ ప్రెస్ వే, మెట్రో లైన్లను వివరిస్తూ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలోను షేక్ చేస్తోంది.