సురక్ష చేతికే జేపీ ఇన్​ఫ్రాటెక్

సురక్ష చేతికే జేపీ ఇన్​ఫ్రాటెక్

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుని, దివాలా బాటపట్టిన జేపీ ఇన్​ఫ్రాటెక్​ కొనుగోలుకు సురక్ష గ్రూప్​ వేసిన బిడ్​ను నేషనల్​ కంపెనీ లా ట్రిబ్యునల్​ (ఎన్​సీఎల్​టీ) మంగళవారంనాడు ఆమోదించింది. కొనుగోలు చేసిన ఫ్లాట్లను జేపీ ఇన్​ఫ్రాటెక్​ పూర్తిచేయలేకపోవడంతో గత ఆరేళ్లుగా 20 వేల మంది ఇండ్ల కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జేపీ ఇన్​ఫ్రాటెక్​ కమిటీ ఆఫ్​ క్రెడిటార్స్​ (సీఓసీ) అంగీకారం తెలిపిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్​సీఎల్​టీ నుంచి అనుమతి వచ్చింది.

నోయిడా, గ్రేటర్​నోయిడా, నేషనల్​ క్యాపిటల్​ రీజియన్లలో చాలా హౌసింగ్​ ప్రాజెక్టుల అమలును జేపీ ఇన్​ఫ్రాటెక్​ చేపట్టింది. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం తాజాగా జే పీ ఇన్​ఫ్రాటెక్​ రిజొల్యూషన్​ ప్లాన్​ను ఎన్​సీఎల్​టీ ఆమోదించింది. ఇంటెరిమ్​ రిజొల్యూషన్​ ప్రొఫెషనల్​ (ఐఆర్​పీ) నాయకత్వంలో ఒక మానిటరింగ్​ కమిటీని ఏర్పాటు చేయమని ఎన్​సీఎల్​టీ బెంచ్ ఆదేశించింది. రిజొల్యూషన్​ ప్లాన్​ అమలుకు వేగంగా చర్యలను ఈ కమిటీ తీసుకోవాలని సూచించింది. ఏడు రోజులలోపు మానిటరింగ్​ ఏర్పాటు కావాల్సి ఉంటుంది.

రిజొల్యూషన్​ ప్లాన్​లో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆయా కొనుగోలుదారులకు అప్పచెప్పాల్సి ఉంటుందని ఎన్​సీఎల్​టీ స్పష్టం చేసింది. నిర్మాణ కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయనేది రోజువారీగా మానిటరింగ్​ కమిటీ పర్యవేక్షించి, నెలకోసారి ఎన్​సీఎల్​టీ వద్ద రిపోర్టును ఫైల్​ చేయాల్సి ఉంటుంది. 12 కంపెనీలపై ​ఇన్​సాల్వెన్సీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా బ్యాంకులను రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆదేశించింది. ఈ మొదటి లిస్టులోనే జేపీ ఇన్​ఫ్రాటెక్​ లిమిటెడ్​ కూడా ఉంది. వివిధ లిటిగేషన్ల కారణంగా జేపీ ఇన్​ఫ్రాటెక్​ దివాలా ప్రక్రియ చాలా ఆలస్యమైంది.