తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 61 వేల చలాన్ల చెల్లింపులతో 8 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ పరిధిలో 3 లక్షల 54 వేల చలాన్ల ద్వారా 2 కోట్ల 62 లక్షలు వసూలు అయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 1 లక్షల 82 వేల చలాన్ల చెల్లింపు ద్వారా ఒక కోటి 80 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు 76 లక్షల 79 వేల ఆదాయం వచ్చింది. ఆన్ లైన్ పేమెంట్స్ తో వెబ్ సైట్ హ్యాంగ్ అవుతోంది.
పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ మంగళవారం (డిసెంబర్ 26న ) జీవో విడుదల చేశారు. టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్పై 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇచ్చింది.
మరోవైపు.. 2023, డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100 శాతం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే.. అందరూ డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై రాయితీ ఉంటుందని భావించారు. అలా కుదరదని.. డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.