నాలుగేండ్లలో సింగరేణి టార్గెట్ 100 మిలియన్​ టన్నులు

నాలుగేండ్లలో సింగరేణి టార్గెట్  100 మిలియన్​ టన్నులు

మందమర్రి, వెలుగు: దేశీయ బొగ్గుకు అనూహ్యంగా డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచుకునే పనిలో పడింది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చే ఓపెన్​కాస్ట్​ గనులపై ఆశలు పెట్టుకుంటోంది. ప్రస్తుతం 70 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి  టార్గెట్​ నిర్దేశించుకున్న సింగరేణి మరోవైపు ఏటా ఉత్పత్తిని పెంచుకుంటూ రానున్న నాలుగేండ్ల కాలంలో 100 మిలియన్​ టన్నులకు చేరుకోవడంపై దృష్టి సారించింది. 2022–-23ఆర్థిక సంవత్సరం చివరలో కొత్తగా నైనీ బ్లాక్​, వికే 7 ఓసీపీలను అందుబాటులోకి తీసుకురానుంది.  సింగరేణి ప్రస్తుతం 19 ఓసీపీలు, 23 అండర్​గ్రౌండ్​మైన్ల ద్వారా ఉత్పత్తి చేపడుతోంది. కొత్తగా ఒడిశాలోని నైనీ బొగ్గు  బ్లాక్​తో పాటు వీకే-7 ఓపెన్​కాస్ట్​ గనులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు నైనీకి సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేసింది. వీకే -7 ఓసీపీకి సంబంధించిన పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. వీటితోపాటు సింగరేణిలో మరికొన్ని కొత్త గనులను ప్రారంభించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. మూసివేసిన అండర్​గ్రౌండ్​గనులను ఓసీపీలుగా మార్చి వాటి ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి సింగరేణి ప్రణాళికలు చేస్తోంది.

నైనీ నుంచి 10 మిలియన్​టన్నులు

సింగరేణి తొలిసారిగా మరో రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది. తెలంగాణ కేంద్రంగా వందేళ్లకు పైగా బొగ్గు వెలికితీస్తున్న సంస్థ ఒడిశాలో ఓసీపీ ఏర్పాటుకు గ్రీన్​ సిగ్నల్​ పొందింది. కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రం అంగూల్​ జిల్లా మహానది కోల్​ఫీల్డ్స్​పరిధిలోని నైనీ కోల్​బ్లాక్​ను కేటాయించగా 2015 ఆగస్టు 13న సింగరేణితో అగ్రిమెంట్​ జరిగింది. గనిలో మొత్తం 9.12 చదరపు కిలోమీటర్ల పరిధిలో 340 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. నైనీ కోల్​బ్లాక్​లో 20 నుంచి 30 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలుండటంతో టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్​ మీటర్ల మట్టి తొలగిస్తే సరిపోతుంది. సింగరేణిలోని ప్రస్తుత ఓసీపీల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్​ మీటర్ల మట్టిని తొలగించాల్సి వస్తోంది. అందుకే నైనీ కోల్​బ్లాక్​సింగరేణికి లాభదాయకంగా మారనుంది. గని కోసం సేకరించిన 783.275 హెక్టార్ల అటవీ భూములకు  ప్రత్యామ్నాయంగా తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో భూమిని కేటాయించనున్నారు. గని ఏర్పాటుకు అవసరమైన పర్మిషన్ల కోసం ఆరేండ్లుగా నిరీక్షించిన సంస్థకు తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ(ఎంఓఈఎఫ్​) నుంచి ఎన్విరాన్​మెంట్​పర్మిషన్​రావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఏటా 10 మిలియన్​టన్నుల ఉత్పత్తి టార్గెట్​పెట్టుకున్నారు. తక్కువ ఖర్చుతో వెలికితీసే చాన్స్​ఉన్న నైనీ బొగ్గు బ్లాక్​ను 40 ఏళ్ల పాటు నడపనుంది. ఇందులో 2,400 మంది  పర్మినెంటు, కాంట్రాక్ట్​ కార్మికులు పనిచేయనున్నారు. గనిలో ఉత్పత్తి చేసిన బొగ్గును రైలు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లా జైపూర్​ సింగరేణి థర్మల్​పవర్​ ప్లాంట్​కు సరఫరా చేయనుంది.

ఇతర గనుల నుంచి...

శ్రీరాంపూర్ ఓసీపీ, భూపాలపల్లిలోని కేటీకే ఓసీ, కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓసీ -2 గనులకు సంబంధించి కొత్త ఓబీ కాంట్రాక్టులను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. బెల్లంపల్లిలో గతంలో మూసివేసిన  గోలేటీ1,1ఏ అండర్​ గ్రౌండ్​ మైన్లు, బెల్లంపల్లి ఓసీపీ- 2 ఎక్స్​టెన్షన్​మైన్, అబ్బాపూర్​ఓసీపీ ప్రాంతాలను కలిపి కొత్తగా గోలేటీ ఓసీపీగా  చేసేందుకు గతనెల 20న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అన్ని పర్మిషన్లు వస్తే గని నుంచి ఏటా 3.5 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది. ఒడిశాలో కొత్తగా కేటాయించిన న్యూపాత్రిపాద బొగ్గు బ్లాక్​కు సంబంధించిన ప్రక్రియ సాగుతోంది. సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాకు-3, కేకే-6, శ్రావణపల్లి బ్లాకు, సత్తుపల్లి -3 గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క కోయగూడెం బ్లాకు-3కి మాత్రమే ఒకే ఒక టెండరు వచ్చింది. దీంతో ఈ గనిని ఆ సంస్థకు కేటాయిస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. మిగితా మూడు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయిస్తే బొగ్గు ఉత్పత్తి పెంచుకునే ఆస్కారం ఉంది. వీటి ద్వారా ఏటా 20 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి వచ్చే చాన్స్​ఉంది.