న్యూఢిల్లీ: ఉత్తరాదిలో మంచు బీభత్సం కొనసాగుతోంది. హిల్ స్టేట్స్లో భారీగా మంచు కురుస్తోంది. మంచుకుతోడు వర్షం కూడా పడుతోంది. దీంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచు కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లన్నీ మూతపడ్డాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.
నిలిచిపోయిన శిథిలాల తొలగింపు
ఉత్తరాఖండ్లో మంచుకుతోడు వర్షం కూడా పడుతుండటంతో జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషిమఠ్లో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. మంచు, చలికి తట్టుకోలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జోషిమఠ్లో శిథిలమైన భవనాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. జోషిమఠ్లోనే కాకుండా సముద్రమట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉన్న చమోలీ, రుద్రప్రయాగ జిల్లాల్లో భారీగా మంచు కురుస్తోందని అంటున్నారు.
శ్రీనగర్, జమ్మూ నేషనల్ హైవే మూత
జమ్మూకాశ్మీర్లో కూడా మళ్లీ మంచుకురవడం మొదలైంది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్, జమ్మూ నేషనల్ హైవే మూత పడింది. పొగ మంచు కారణంగా కాశ్మీర్లోయలో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. టూరిస్ట్ స్పాట్స్ అయిన పహల్గావ్, గుల్మార్గ్, అనంతనాగ్, కుల్గామ్, సోఫియాన్, పుల్వామా, బుడ్గామ్, కుప్వారా, శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయాయి. గుల్మార్గ్లో మైనస్ 7.6 డిగ్రీలు, అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్గా ఉపయోగించే పహల్గావ్లో మైనస్ 2.9, కుప్వారాలో మైనస్ 1.5, శ్రీనగర్లో మైనస్ 0.1 డిగ్రీల మినిమం టెంపరేచర్ నమోదైంది. జమ్మూకాశ్మీర్లో మరో వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో 278 రోడ్లు మంచు, పొగ మంచు కారణంగా మూతపడ్డాయి.
పెరుగుతున్న మినిమం టెంపరేచర్లు
ఢిల్లీలో 10.6 డిగ్రీల మినిమం టెంపరేచర్ నమోదైంది. హర్యానా, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని మైదాన ప్రాంతాల్లో మినిమం టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. హర్యానాలోని నర్నవుల్లో 7.5 డిగ్రీలు, హిస్సార్లో 9.1, సిర్సాలో 9.2, కర్నాల్లో 9.7, అంబాలాలో 10 డిగ్రీల మినిమం టెంపరేచర్లు రికార్డయ్యాయి. పంజాబ్లోని భటిండాలో 7 డిగ్రీలు, పటియాలా 8.6, మొహలీ 9.4, ఫరీద్కోట్ 9.5, అమృత్సర్, లూథియానాల్లో 10 డిగ్రీలు చొప్పున మినిమం టెంపరేచర్లు నమోదయ్యాయి.