రైతు గోస పట్టని సర్కార్..36 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రైతు గోస పట్టని సర్కార్..36 లక్షల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: భారీ వానలకు పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. 36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ఇప్పటిదాకా రైతులకు ఎలాంటి హామీ రాలేదు. నష్టపరిహారం అందించడంపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. గ్రౌండ్ లెవెల్​లో వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి, పంట నష్టంపై అంచనా వేయాల్సిన సర్కారు.. పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది పంట బీమా అమలు చేయలేదు. ఐదేళ్లుగా ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వడం లేదు. రైతులు దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

అధికారిక అంచనానే 15 లక్షల ఎకరాలు

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు 8 లక్షల ఎకరాల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్‌‌లో మొత్తం 15 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తేలింది. కానీ గ్రౌండ్ లెవల్​లో ప్రతి గ్రామానికి ఏఈవోలు, ఏవోలు పర్యటించి సర్వే చేస్తే రెట్టింపు స్థాయిలో పంట నష్టం తేలే చాన్స్‌ ఉందని రైతు సంఘాలు అంటున్నాయి.

పత్తి, వరిపై భారీ ఎఫెక్ట్

వానాకాలంలో అత్యధికంగా వేసిన పత్తి, వరి, కంది పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ సీజన్‌‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగైతే.. 36 లక్షల ఎకరాలు అకాల వర్షాలతోనే దెబ్బతిన్నట్లు సమాచారం. తాజా వర్షాలకే 20 లక్షల ఎకరాల్లో వంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది.10.78 లక్షల ఎకరాల్లో కంది వేస్తే.. 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనాలు ఉన్నాయి. సోయ, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పెసర, నువ్వులు, మినుముల పంటలకు 4 లక్షల ఎకరాల్లో నష్టం కలిగినట్లు తెలుస్తోంది.

చేతికొచ్చే దశలో నాశనం

వర్షాల వల్ల చేతికొచ్చే దశలో ఉన్న పంటలన్నీ దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి, తీసే దశలో ఉన్న పత్తి, సోయా, మక్కలు నీటి పాలయ్యాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో కాయలు పగిలి దూది వచ్చే దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దూది నుంచి విత్తనాలు మొలకెత్తాయి. వరి పంట నేలకొరిగింది. వడ్లు తడిసి ముద్దయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి,-ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది.

వర్షాలు ఆగినంక..

వర్షాలు ఆగిన తర్వాత స్పష్టమైన వివరాలు సేకరిస్తాం. పంట పొలాల్లో నుంచి నీరు వెళ్లాక నష్టం ఎంతో లెక్కిస్తాం. మరో రెండు రోజులు వానలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఎన్యుమరేషన్‌‌ చేపడతాం. పంట నష్టం అంచనాలు ప్రభుత్వానికి అందించాం. కేంద్రం, రాష్ట్రం వాటాతో ఇన్‌‌పుట్ సబ్సిడీపై నిర్ణయం ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

– బి.జనార్దన్‌‌రెడ్డి, అగ్రికల్చర్‌‌ సెక్రటరీ

ఎకరానికి 20 వేలు ఇవ్వాలె

వ్యవసాయ శాఖ అంచనాకు మించి పంట నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇచ్చే వాళ్లు. తెలంగాణ వచ్చాక ఒక ఏడాది ఇచ్చి తర్వాత ఇవ్వలేదు. పంటనష్టపోయిన వారి వివరాలు సేకరించి ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి. రుణాలు, వడ్డీ మాఫీ చేయాలి. యాసంగికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. పెట్టుబడి ప్రభుత్వమే చెల్లించాలి.

– మూడ్‌‌ శోభన్‌‌, సహాయక కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం