- ఎఫ్సీఐకి ఇంకా 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని ఇయ్యని సర్కార్
- ఏడేండ్లుగా బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కెపాసిటీనే పెంచుతున్న ప్రభుత్వం
- రోజూ 41,166 టన్నుల ముడి బియ్యం, 72,120 టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్
- సర్కారు, మిల్లర్ల తీరుతో నష్టపోతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండిన వడ్లను కేంద్రం కొనబోమంటోందని ఆరోపిస్తున్న రాష్ట్ర సర్కారు.. రా రైస్(ముడి బియ్యం) మిల్లింగ్కెపాసిటీని మాత్రం పెంచట్లేదు. ఏడేండ్లుగా బాయిల్డ్ రైస్ మిల్లింగ్నే పెంచుతోంది. దీంతో రా రైస్గానీ, పోషకాలను కలిపి తయారు చేసే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కానీ అందించాలన్న ఎఫ్సీఐ నిబంధనలకు తగినట్టు బియ్యాన్ని ఇవ్వలేకపోతోంది. అసలు, ఈ యాసంగి వడ్లు కొనాలంటున్న సర్కారు.. పోయిన యాసంగి, వానాకాలం పంటనే పూర్తిగా కేంద్రానికి ఇవ్వలేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన దాంట్లో కొన్ని లక్షల టన్నుల వడ్లను కనీసం మిల్లింగ్ చేయనేలేదు. మిల్లింగ్లో కొత్త టెక్నాలజీలు వచ్చినా అందుకు అనుగుణంగా సర్కారు మార్పులు చేసుకోలేదన్న విమర్శలూ వస్తున్నాయి. ఇటు మిల్లర్లుకూడా వడ్లను రా రైస్గా పట్టిస్తే లాభం ఉండదన్న కారణంతో.. బాయిల్డ్రైస్ కెపాసిటీనే పెంచుకున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్ల తీరుతో నడిమిట్ల రైతులు నష్టపోతున్నారు.
ఏడాదైనా మిల్లింగ్ కాలే...
నిరుడు యాసంగిలో 92.34 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఎఫ్సీఐ అనుమతించింది. ఆ వడ్లను మిల్లింగ్ చేసి 62.53 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి సర్కారు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఏడాదైపోతున్నా ఇప్పటికీ వడ్ల మిల్లింగ్ పూర్తిగా కాలేదు. ఇప్పటికీ రా రైస్ 6.63 లక్షల టన్నులు, బాయిల్డ్ రైస్ 3.08 లక్షల టన్నులు కలిపి మొత్తం.. 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. అంతేగాకుండా నిరుడు వానాకాలానికి సంబంధించిన 3 వేల టన్నుల బియ్యాన్నీ ఎఫ్సీఐకి సర్కారు ఇవ్వలేదు.
మిల్లింగ్ కెపాసిటీ తక్కువే
రాష్ట్రంలో 2,476 రైస్ మిల్లులున్నాయి. వాటితో రోజుకు రెండు షిఫ్టుల్లో కేవలం 41,166 టన్నుల రా రైస్ మిల్లింగ్ చేసుకునే సామర్థ్యం ఉంది. బాయిల్డ్ రైస్ మిల్లింగే ఎక్కువగా జరుగుతోంది. రోజూ రెండు షిఫ్టుల్లో 72,120 టన్నుల బాయిల్డ్ రైస్ ను మిల్లింగ్ చేస్తున్నారు. ఏడేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కెపాసిటీని పెంచారే తప్ప.. రారైస్ కెపాసిటీని మాత్రం పెంచలేదు. ఇటు ఫోర్టిఫైడ్ రైస్ బియ్యాన్ని పట్టే మిల్లులు 200 మాత్రమే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో పెరుగుతున్న దిగుబడికి తగ్గట్టు మిల్లింగ్ సామర్థ్యం లేకపోవడం, ప్రస్తుత అవసరాలకు తగ్టట్టు మార్పులు చేసుకోకపోవడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మిల్లింగ్ కెపాసిటీని పెంచుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పుతాయని సూచిస్తున్నారు.
పంజాబ్ ఇస్తున్నది ముడి బియ్యమే
పంజాబ్ ఇస్తున్న ధాన్యం కొంటున్నరు..మేం ఇచ్చే ధాన్యాన్ని ఎందుకు కొనరని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రశ్నిస్తోంది. నిజానికి పంజాబ్లో వానాకాలం మాత్రమే వరి సాగు చేస్తారు. ఎఫ్సీఐ నిబంధనలకు అనుగుణంగా కేంద్రానికి పంజాబ్ ముడి బియ్యాన్నే ఇస్తున్నది. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పోయిన ప్రతిసారీ కేంద్రం చెప్తున్న మాట కూడా ఇదే. పంజాబ్లాగానే యాసంగిలో ముడి బియ్యాన్నిస్తే తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఇటీవలి సమావేశంలోనూ కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర సర్కారు బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామని, ఆ బియ్యాన్నే కొనాలని డిమాండ్ చేస్తోంది.