
- ఒకటి సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్లో..
- రెండోది ఓటరు లిస్టు ఆధారంగా బీసీ సర్వే
- త్వరలో కొత్త బీసీ కమిషన్.. నవంబర్లో స్థానిక ఎన్నికలు!
హైదరాబాద్, వెలుగు: కులగణనను రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండు విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తున్నది. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్లో కుల గణన చేయడంతోపాటు ఓటరు లిస్ట్ ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒకదశలో ప్రభుత్వం భావించింది. కానీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నది. బీసీల లెక్క, రిజర్వేషన్లు తేల్చాకే లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది.
కులగణన కోసం ఇతర రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు, బీసీలకు రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు, ఎదురయ్యే లీగల్ సమస్యలు, ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అందుకు తగ్గట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ నిధులనే కులగణన కోసం వెచ్చించనున్నారు. మరోవైపు ఈ నెలఖారుకు బీసీ కమిషన్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ వెంటనే ప్రత్యేక ఫార్మాట్లో క్యాస్ట్ సెన్సస్, ఓటర్ల జాబితాలో బీసీ గణన రెండూ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నామని సెక్రటేరియెట్లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
నవంబర్ చివరిలో స్థానిక ఎన్నికలు?
గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలన నడుస్తున్నది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కులగణన కూడా చేపడుతామని తెలిపింది.
ఇంకోవైపు స్పెషలాఫీసర్ల పాలన ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్ గ్రాంట్లు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనందున.. అక్టోబర్ చివరి కల్లా క్యాస్ట్ సెన్సస్, ఓటర్ల జాబితాతో బీసీ గణను పూర్తి చేయాలనుకుంటున్నది. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచాలని చూస్తున్నది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సెక్రటేరియెట్లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.