హైదరాబాద్, వెలుగు: మునిగిపోయే ప్రాజెక్టు కోసం సర్వే పేరిట రాష్ట్ర సర్కారు హంగామా చేస్తోంది. ‘సీతమ్మసాగర్’ ప్రాజెక్టులో మునిగిపోయే దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును మీటర్ మేర పెంచడం కోసం సర్వే చేయించేందుకు సిద్ధమైంది. మూడేండ్ల కిందట ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ప్రపోజల్స్కు సర్కారు తాజాగా ఓకే చెప్పింది. సర్వే బాధ్యతలను ‘కాన్టెక్ డీఈఎస్’ అనే సంస్థకు రూ.1.91 కోట్లకు అప్పజెప్తూ.. ఇరిగేషన్ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గోదావరిపై 63 మీటర్ల ఎత్తుతో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు దిగువన 200 మీటర్ల దూరంలోనే సీతమ్మ సాగర్ లిఫ్ట్ స్కీంను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఆ లిఫ్ట్ స్కీంకు పైన ఉన్న దుమ్ముగూడెం ఎత్తు కేవలం 47 మీటర్లు. కాబట్టి దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును ఇంకో మీటర్ పెంచినా.. సీతమ్మసాగర్ కన్నా ఇంకా 15 మీటర్ల మేర తక్కువ ఎత్తే ఉంటుంది. కాబట్టి భవిష్యత్లో గోదావరి పూర్తిగా ఎండిపోతే తప్ప దుమ్ముగూడెం ఆనకట్ట కనిపించే అవకాశమే లేదు. ఇప్పటికే సీతమ్మసాగర్ ముంపు ప్రభావం సహా అనేక అంశాలపై సర్వే పూర్తి చేశారు.
అయితే, ఇప్పుడు ఆ లిఫ్ట్ ప్రాజెక్ట్లో మునిగిపోయే దుమ్ముగూడెం ఎత్తు పెంచడం వల్ల కలిగే ప్రభావాలపై కొత్తగా సర్వే చేసి ఏం చేస్తారన్నది అంతు చిక్కని ప్రశ్న. ఇక సర్వేలో భాగంగా టోపోగ్రాఫికల్, డీటెయిల్డ్ సర్వే, జియోగ్రాఫికల్ ఇన్వెస్టిగేషన్, రివర్బెడ్పై ప్రభావం, డిజైన్స్, డ్రాయింగ్స్, డీపీఆర్ పనులను ఆ సంస్థ చూడనుంది. ఆనకట్టకు ఎగువ, దిగువల్లో పడే ప్రభావం, ముంపు తీవ్రతపైనా సంస్థ రిపోర్ట్ ఇవ్వనుంది. సర్వే సంస్థ ఇప్పటికే కొంత వరకు పనులు కూడా చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు సర్వేకి సంబంధించి గతంలోనే ప్రభుత్వం రూ.27.75 లక్షలతో పాలనా అనుమతులను ఇచ్చింది. ఆ మొత్తాన్ని రూ.1.91 కోట్లకు పెంచాలని ఇరిగేషన్ ఈఎన్సీ 2019లో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇప్పుడు వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్వే కాంట్రాక్ట్ను దక్కించుకున్న సంస్థకు ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించింది. దీనిపై ఇరిగేషన్ కొత్తగూడెం సీఈని ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.
సీతారామ లిఫ్ట్ స్కీంగా రీడిజైన్
గోదావరి నదిపై భద్రాచలం దగ్గరలోని దుమ్ముగూడెం గ్రామం వద్ద సర్ ఆర్థర్ కాటన్ 150 ఏండ్ల కింద 47 మీటర్ల ఎత్తులో దుమ్ముగూడెం ఆనకట్టను కట్టారు. దీని ఆధారంగానే ఉమ్మడి ఏపీలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నారు. తెలంగాణ వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులను కలిపి సీతారామ లిఫ్ట్ స్కీంగా రీడిజైన్ చేశారు. ఈ పథకం కోసం దుమ్ముగూడెం ఎత్తు పెంచాలని మొదట ప్రతిపాదించారు. అయితే దానికి బదులు దుమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్ల దిగువన సీతమ్మసాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మిస్తున్నారు. 67 గేట్లతో ఈ బ్యారేజీని నిర్మిస్తున్నారు. 36.57 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా నిల్వ చేయడంతో పాటు 320 మెగావాట్ల కరెంట్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే పనులనూ మొదలుపెట్టింది