ఫీల్డుకు పోతలే.. అక్రమ నిర్మాణాలను  పట్టించుకోవట్లే!

ఫీల్డుకు పోతలే.. అక్రమ నిర్మాణాలను  పట్టించుకోవట్లే!
  • శేరిలింగంపల్లి జోన్​లో న్యాక్ ​ఇంజనీర్ల తీరు ఇదీ..

మాదాపూర్, వెలుగు: జీహెచ్ఎంసీలో న్యాక్​ ఇంజనీర్ల వ్యవస్థ గాడి తప్పింది. ఫీల్డ్​లో తిరిగి అక్రమ నిర్మాణాలను గుర్తించి జీహెచ్ఎంసీ వెబ్​సైట్​లో అప్​లోడ్​చేయాల్సిన శేరిలింగంపల్లి జోన్​ పరిధి న్యాక్​ ఇంజ
నీర్లు ఆఫీసులకే పరిమితమవుతున్నారు. వీరిని టౌన్​ప్లానింగ్ అధికారులు కంప్యూటర్​ ఆపరేటర్లుగా ఉపయోగించుకుంటున్నారు. కోర్టు కేసులు, నోటీసుల జారీ వంటి పనులు చేయిస్తూ అఫీసులకే పరిమితం చేస్తున్నారు. అక్రమ సంపాదనకు గండిపడుతోందని కావాలనే వారిని ఫీల్డ్​కు వెళ్లకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్కిల్​కు ఒకరిద్దరే...

జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్​లో చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్​చెరు, యూసుఫ్​గూడ సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలను న్యాక్​ ఇంజనీర్లు గుర్తించి వాటిని జీహెచ్ఎంసీ వెబ్​సైట్​లోని యూసీఐఎంఎస్​లో అప్​లోడ్ ​చేయాలి. ఆ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేట్టాలి. అయితే, ఒక్కో డివిజన్​కు ఒక్కో న్యాక్​ ఇంజనీర్​ఉండాల్సినప్పటికీ.. ప్రస్తుతం చందానగర్​సర్కిల్​లో నాలుగు డివిజన్లకు ఇద్దరే ఉన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్​లో మూడు డివిజన్లకు ఇద్దరే ఉన్నారు. శేరిలింగంపల్లి జోన్​లో న్యాక్​ఇంజనీర్లు ఫీల్డ్​కు పోతలేరు. అఫీసులకే పరిమితమవుతూ టౌన్​ప్లానింగ్ అధికారులు ఇచ్చే పనులే చేస్తున్నారు. తమ ఏరియాలో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఎవరైనా స్థానికులు బిల్డింగ్ ​ఫొటోలు, అడ్రస్​ పంపిస్తే వాటిని అప్​లోడ్​చేసి చేతులు దులుపుకుంటున్నారు. 

చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు

ఫీల్డ్​లో అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయడం, వాటిపై చర్యలు తీసుకోవడం వల్ల టౌన్​ప్లానింగ్​అధికారుల అక్రమ ఆదాయం దెబ్బతింటోందని.. అందుకోసమే న్యాక్​ ఇంజనీర్లను ఫీల్డ్​కు వెళ్లకుండా డివిజన్​చైన్​మెన్లతో కుమ్మక్కై వారిని ఫీల్డ్​కు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తాము చెప్పింది వింటే మీకు అన్నీ రకాల సపోర్ట్ ​ఉంటుందంటూ వారిని దారికి తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం న్యాక్​ఇంజనీర్లకు ప్రతి నెలా కొంత అమౌంట్​అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా తెలిసినా.. ఉన్నతాధి కారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. న్యాక్ ​నోడల్​ ఆఫీసర్, జోనల్​ కమిషనర్ తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.