ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్ను యూఎస్ ఫెడ్ నిర్ణయించనుంది. ఫెడ్ పాలసీ నిర్ణయం ఈ నెల 3 న వెలువడనుండగా, 4 వ తేదీన యూరప్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది. వీటికి అదనంగా కార్పొరేట్ కంపెనీల క్యూ4 రిజల్ట్స్, మాక్రో ఎకనామిక్ డేటా, విదేశీ ఇన్వెస్ట్మెంట్ల కదలికలు ఈక్విటీ మార్కెట్ల డైరెక్షన్ను నిర్ణయించనున్నాయి. కాగా, మహారాష్ట్ర దినోత్సవం కారణంగా సోమవారం మార్కెట్కు సెలవు. ఈ వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ ఉంటుంది. ఒకవైపు రెసిషన్ భయాలు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు..గ్లోబల్గా పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేష్ గౌర్ అన్నారు. ఫెడ్, ఈసీబీ మీటింగ్పై అందరి కళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. మాక్రో ఎకానమిక్ డేటా కూడా మార్కెట్ను ప్రభావితం చేయనుందని వెల్లడించారు.
‘వీటికి అదనంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. శుక్రవారం సెషన్లో నికరంగా రూ.3,304 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇండియన్ మార్కెట్పై నమ్మకంగా ఉన్నారు’ అని వివరించారు. ఈ వారం టాటా స్టీల్, టైటాన్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ క్యూ4 రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఇవి నిఫ్టీ 50 లో ఉన్నాయి. మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్స్, యూకో బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఫోర్జ్, ఫెడరల్ బ్యాంక్లు కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ను ప్రకటించనున్నాయి. సోమవారం ఆటో సేల్స్ వెలువడనుండగా, ఈ వారమే పీఎంఐ డేటా బయటకు రానుంది. కాగా, కిందటి వారం సెన్సెక్స్ 1,457 పాయింట్లు (2.44 శాతం) పెరిగింది.
ఏప్రిల్లో రూ.11,630 కోట్లు..
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) ఈ ఏడాది ఏప్రిల్లో నికరంగా రూ.11,630 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డాలర్ మారకంలో రూపాయి బల పడుతుండడం, మార్కెట్ వాల్యుయేషన్ ఆకర్షణీయంగానే ఉండడంతో ఎఫ్ఐఐలు ఇండియన్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎఫ్ఐఐలు రూ.7,936 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.