
- తన సోషల్ మీడియా సంపాదన గురించిన వార్తల్లో నిజం లేదన్న విరాట్
ముంబై: సోషల్ మీడియాలో ప్రమోషనల్ పోస్టులు చేయడం ద్వారా భారీ మొత్తం సంపాదిస్తున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్టుకు కోహ్లీ రూ. 11.45 కోట్లు చార్జ్ చేస్తున్నాడన్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో 25 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న విరాట్.. ఇన్స్టా సంపాదనలో సాకర్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ తర్వాత మూడో స్థానంలో ఉన్నట్టు ఓ సంస్థ వెల్లడించింది.
అయితే, ఇందులో వాస్తవం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికీ నేనెంతో కృతజ్ఞతతో ఉన్నాను. కానీ, నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
మళ్లొచ్చినప్పుడు సెల్ఫీ ఇస్తా
వరల్డ్ వైడ్గా కోహ్లీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతనితో ఫొటో దిగేందుకు పోటీ పడుతుంటారు. తాజాగా ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన కోహ్లీ తన కారు ఎక్కుతుండగా ఓ అభిమాని పరుగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ అడిగాడు. కాస్త హడావుడిగా వెళ్తున్న విరాట్.. మళ్లీ ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు కచ్చితంగా సెల్ఫీ ఇస్తానని అతనికి హామీ ఇచ్చాడు. ఈనెల 30న తాను ఎయిర్పోర్ట్కు వస్తానని అతనికి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.