హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వామపక్షాల్లో కొంత ఐక్యత లోపించిందన్నారు. ఒకటీ రెండు సీట్ల కోసం తమ రాజకీయ వైఖరిని బద్దలు కొట్టడం ఇష్టం లేదని, అందుకే కొత్తగూడెం సీటుతో సంతృప్తి పడ్డామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, సీపీఎం కూడా తమతో కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన ‘వీ6 వెలుగు’తో మాట్లాడారు. సీపీఎం వైఖరిపై బయట ఆరోపణలు వస్తున్నాయని, అవి కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్లేదా కాంగ్రెస్ కు మద్దతిస్తామన్న సీపీఎం వైఖరి కన్ఫ్యూజ్ గా ఉందన్నారు. కొత్తగూడెంలో ఐదుగురు కౌన్సిలర్స్ ముందు నుంచి అసంతృప్తి వాదులుగా ఉన్నారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నామన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో మార్పు వచ్చిందని, ధన రాజకీయం వచ్చిన తర్వాత ఉన్నంతలోనే కమ్యూనిస్టు పార్టీలు ఫైట్ చేస్తున్నాయని చెప్పారు. వైభవం లేకపోయినా పోరాటాలు ఆపడం లేదన్నారు. కేసీఆర్ దళిత 'సీఎం హామీ ఏమైందన్నారు.