గ్రూప్‑4 నోటిఫికేషన్పై క్లారిటీ రావడం లేదు. మార్చిలో పోస్టుల సంఖ్య ప్రకటించిన సర్కారు, ఆ తర్వాత భర్తీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. త్వరలో.. త్వరలో.. అంటూ కాలం వెల్లదిస్తున్నది.
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–4 నోటిఫికేషన్పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మార్చిలో పోస్టుల సంఖ్య ప్రకటించిన సర్కారు, ఆ తర్వాత భర్తీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. త్వరలో.. త్వరలో.. అంటూ కాలం వెల్లదిస్తున్నది. అయితే రాష్ట్రంలో వీఆర్ఓల అడ్జెస్ట్మెంట్తో పోస్టులపై కూడా అయోమయం నెలకొన్నది. గతంలో ప్రకటించిన పోస్టులను నింపుతారా.. లేదా.. అనే దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
లక్షలాది అభ్యర్థుల ఎదురుచూపులు
రాష్ట్రంలో 80వేల పోస్టులను భర్తీ చేస్తామని మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించారు. దీంట్లో గ్రూప్–4 పోస్టులు 9,168 ఉన్నట్టు వెల్లడించి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ గ్రూప్–4 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకాలేదు. ఎక్కువ పోస్టులు ఉండటంతో ఈ పోస్టుల కోసం ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్దఎత్తున పోస్టులను నింపడం ఇదే మొదటిసారి. దీంతో ఈసారి ఎలాగైనా జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో వేలాది మంది నిరుద్యోగులు ప్రిపరేషన్ కోసం గ్రామాల నుంచి హైదరాబాద్ బాట పట్టారు. మేలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించి, అదే నెలాఖరులోగా గ్రూప్–4 ఖాళీల వివరాలు, రోస్టర్ వారీగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో జూన్ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ ఖాళీల వివరాలు పలు డిపార్ట్మెంట్ల నుంచి రాలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క 15రోజుల కిందే ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కానీ గ్రూప్–4 పోస్టుకు ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇప్పటికీ రాలేదు.