
టెల్అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తాము ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆయన కోసం తమ సైన్యం తీవ్రంగా గాలించిందని వెల్లడించింది. ఈమేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీని అంతమొందించేందుకు తీవ్రంగా గాలించినా.. ఆయన ఆచూకీ లభించలేదని చెప్పారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తమ ప్లాన్ను విరమించుకున్నామని వెల్లడించారు. ‘‘బంకర్లోకి వెళ్లిపోయాక ఖమేనీ ఆచూకీ దొరకలేదు. ఒకవేళ మాకు కనిపించి ఉంటే.. ఆయనను బయటకు తెచ్చేవాళ్లం. ఆయన కోసం తీవ్రంగా వెదికాం. సరైన అవకాశం లభించకపోవడంతో మేం విఫలమయ్యాం” అని తెలిపారు.
బంకర్లో ఉన్నంత వరకే సేఫ్..
గతేడాది తమ చేతిలో చనిపోయిన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మాదిరిగా సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని కాట్జ్ చెప్పారు. ‘‘ఖమేనీకి నా సలహా ఒక్కటే.. ఆయన ఇప్పుడు దాక్కున్నట్టు భూగర్భ బంకర్లోనే ఉండడం ఉత్తమం.. బయటికి వస్తే ప్రమాదమే’ అని కాట్జ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే, యుద్ధంలో అమెరికా చేరుతుందని తమకు ముందుగా తెలియదన్నారు.
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను ఎక్కడ దాచిందో కూడా తమకు తెలియదని వెల్లడించారు. ఖమేనీని చంపేందుకు అమెరికా అనుమతి తీసుకున్నారా? అని మీడియా అడగ్గా.. ఇలాంటి వాటికి తమకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదని కాట్జ్ సమాధానమిచ్చారు. కాగా, ఇరాన్లోని అణుస్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇప్పటిదాకా చెప్పిన ఇజ్రాయెల్.. కాట్జ్ వ్యాఖ్యలతో ఇరాన్ లీడర్షిప్నూ లక్ష్యంగా చేసుకొన్నట్లు తొలిసారి అధికారికంగా ప్రకటించినట్టయింది.