- పుస్తెలతాడు కొట్టేసిన దొంగలు
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: ఇద్దరు దొంగలు పోలీసులమని నమ్మించి ఓ మహిళ పుస్తెలతాడుతో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ టౌన్ పరిధి లక్ష్మినగర్ కాలనీలో నివసించే సుందరి మంగళవారం మెట్టుగడ్డ సమీపంలోని ఆఫీస్ లో కరెంట్ బిల్లు కట్టింది. తిరిగివస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను అడ్డగించారు. పోలీసులమని చెప్పి.. బంగారు ఆభరణాలు మెడలో వేసుకొని తిరగొద్దంటూ మాయమాటలు చెప్పారు.
ఆమె మెడలోంచి 4.5 తులాల పుస్తెల తాడును తీయించి వేరే సంచిలో పెట్టినట్లు నటించారు. ఆ తర్వాత మరో సంచిని ఇచ్చి పరారయ్యారు. ఇంటికి వెళ్లి చూడగా సంచిలో గులకరాళ్లు కనిపించడంతో బాధితురాలు లబోదిబోమంది. బుధవారం ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గాంధీ నాయక్ తెలిపారు.
