‘మసూద’వంటి హారర్ థ్రిల్లర్ తో తిరువీర్ (Thiruveer) హీరోగా ఎంట్రీ ఇచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో, తెలుగు ఇండస్ట్రీలో తిరువీర్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 2023లో వచ్చిన తెలంగాణ యాస కామెడీ చిత్రం 'పరేషాన్'లో హీరోగా తనదైన మార్కు నటనతో మంచి మార్కులు కొట్టేయడమే కాక, ‘కుమారి శ్రీమతి’వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించారు.
ఈ క్రమంలోనే రీసెంట్గా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show) మూవీ విజయంతో తిరువీర్ ఇప్పుడు టాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇందులో తనదైన నటనతో అలరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అందుకు ఈ సినిమా కథ కథనం తిరువీర్కు ఎంతోగానూ తోడ్పడింది.
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. రియల్ పాయింట్కు కామెడీ, ఎమోషన్స్ జోడించి తెరకెక్కించిన సినిమా ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. సన్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంత ప్రజల ప్రవర్తన, మాట తీరును సహజంగా చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కమర్షియల్ హంగుల కోసం కాకుండా, మనిషి జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయతీ కలయికగా ఈ సినిమా రూపొంది బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ మూవీ IMDBలో 8.5 రేటింగ్ పొందడం విశేషం.
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఓటీటీ:
ఇపుడు ఈ తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో".. వచ్చే నెల డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.
“థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ తర్వాత, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎన్నో నవ్వులను మోసుకుంటూ జీ5లోకి వస్తోంది. ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్తో జీ5 ఓటీటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ క్రేజీ అప్డేట్తో ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.
ఈ చిత్రంలో తిరువీర్తో పాటు టీనా శ్రావ్య టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా కీలకపాత్రలో నటించారు. 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్లో నిర్మించిన ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఆయన భార్య కల్పనా రావు వ్యవహరించడం విశేషం. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రస్తుతం తిరువీర్ తన కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తుంది. అలాగే, 'భగవంతుడు' అనే మరో ప్రాజెక్ట్ కూడా సెట్స్పై ఉంది.
కథేంటంటే:
శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో రమేష్ (తిరువీర్), జిరాక్స్ సెంటర్తో పాటు ఫోటో స్టూడియో నడిపిస్తుంటాడు. అలా ఆ ఊర్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఇక అదే ఊర్లో, తన ఫోటో స్టూడియోకి ఎదురుగా పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ పంచాయితీ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నహేమ (టీనా శ్రావ్య)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. హేమకు కూడా రమేష్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ, ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోకుండా ప్రేమించుకుంటారు.
అలా ఒకరోజు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) రమేష్ను కలుస్తాడు. ఈ క్రమంలో తనకు సౌందర్య (యామిని నాగేశ్వర్)తో పెళ్లి సెట్ అయిందని చెబుతాడు. ఇందుకోసం తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ను గ్రాండ్గా తీయాలని రమేష్ను ఆనంద్ కోరుతాడు. వెంటనే ఒకే చెప్పి.. దాదాపు రెండు లక్షలు ఖర్చుపెట్టించి గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు రమేష్. అయితే, ఆ ఫుటేజ్ అంత ఉన్న చిప్ను కాపీ చేయమని తన దగ్గర పనిచేసే అబ్బాయి (రోహన్ రాయ్)కి ఇస్తాడు. కానీ, అతను ఆ చిప్ను ఎక్కడో పొగొడతాడు.
ఊర్లో రాజకీయ బలగం ఉన్న ఆనంద్కి.. చిప్ పోయిందనే విషయం తెలిస్తే, తనని ఏదైనా చేస్తాడని రమేష్ భయపడుతాడు. ఈ క్రమంలో ఆనంద్కి ఏం చెప్పాలో తెలియక, తప్పించుకుంటూ ఉంటాడు. కాల్స్ చేసిన కట్ చేస్తుంటాడు. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని ఒక ఉపాయం ఆలోచిస్తాడు. కానీ, అంతలోనే ఆనంద్ మ్యారేజ్ ఆగిపోయిందనే వార్తా వినిపిస్తుంది. అసలు చిప్ ఎలా మిస్ అవుతుంది? సడెన్గా పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? రమేష్ ఆలోచించిన ఆ ఉపాయం ఏంటీ? రమేష్, హేమల లవ్ మ్యాటర్ ఎంతవరకు వస్తుంది? చివరకు ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే!!
