న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం ద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయబోతున్నారు. మనదేశ మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి అయిన సీతారామన్ జులై 2019 నుంచి ఐదు పూర్తి బడ్జెట్లను సమర్పించారు. వచ్చే నెల ఒకటో తేదీన మధ్యంతర లేదా వోటాన్- అకౌంట్ బడ్జెట్ను సమర్పించనున్నారు. మాజీ ఆర్థికమంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా ఐదు బడ్జెట్లను సమర్పించారు.
దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్లు, 1959–-1964 మధ్య ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. ఫిబ్రవరి 1న నిర్మల సమర్పించనున్న 2024-–25 మధ్యంతర బడ్జెట్, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కొంత మొత్తంలో డబ్బును ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. గత నెలలో ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మధ్యంతర బడ్జెట్లో అద్భుతమైన ప్రకటనలు ఏవీ ఉండబోవని అన్నారు. ఇది సాధారణ ఎన్నికలకు ముందు వచ్చే వోటాన్-అకౌంట్ అని అన్నారు. ఈ ఏడాది జూన్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం 2024–-25 సంవత్సరానికి సంబంధించిన తుది బడ్జెట్ను జులైలో ప్రవేశపెట్టనుంది.
అరుణ్ జైట్లీ కూడా ఐదు..
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2014-–15 నుంచి 2018-–19 వరకు ఐదు బడ్జెట్లను సమర్పించారు. జైట్లీ అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్ ఫిబ్రవరి 1, 2019 నాడు 2019–-20కి మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. జీతాలు తీసుకునే పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ను రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు పెంచారు గోయల్.
వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించని వారికి పన్ను రాయితీని రూ.2,500 నుంచి రూ.12,500కి పెంచారు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత, మోదీ 2.0 ప్రభుత్వంలో నిర్మలకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. 1970–-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ను సమర్పించిన రెండవ మహిళ నిర్మలే! సంప్రదాయ బడ్జెట్ బ్రీఫ్కేస్ను తీసివేసి, బదులుగా సంచిలో ఫైల్స్ను తీసుకొస్తున్నారు.