
కరోనా భయంతో … ‘‘మా ప్రపంచం మాదే’’ అని చుట్టూ గిరిగీసుకుని బతుకుతున్న కాలం ఇది. ఇలాంటి టైంలో స్వార్థాన్ని పక్కనపెట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు హైదరాబాద్కి చెందిన అషార్ అహ్మద్ షేక్. రోజు రోజుకి పెరుగుతోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించాడు. స్నేహితులతో కలిసి రెండు రోజుల్లోనే కరోనా అనుమానితులు, పేషెంట్స్ కదలికల్ని గమనించడానికి ఒక ట్రాకర్ కనిపెట్టాడు. క్వారంటైన్ సెంటర్స్, ఐసోలేషన్ వార్డ్స్లో ఈ ట్రాకర్ని ఫిక్స్ చేసి కరోనా బాధితుల్ని ఎక్కడున్నా గుర్తించే వెసులుబాటు కల్పించాడు. అది కూడా అతి తక్కువ ధరలోనే.. అసలు ఈ ట్రాకర్ వెనకున్న కథతో పాటు .. ఎలా పనిచేస్తుందో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మాటల్లోనే.
‘‘నాకు చిన్నప్పట్నించీ ప్రయోగాలంటే చాలా ఇష్టం. ఏదైనా మెషిన్ లేదా, వెరైటీ వస్తువు కనబడితే చాలు నిమిషాల్లో పోస్ట్మార్టం చేసి పార్ట్స్ బయటకు తీసేవాడ్ని. అసలు ఆ వస్తువు అలానే ఎందుకు ఉంది? ఎలా పనిచేస్తుంది? అని గంటలు గంటలు ఆలోచించేవాడ్ని. రిమోట్ కార్ల బ్యాటరీలు పీకి ఏవేవో ఎక్స్పరిమెంట్స్ చేస్తుండేవాడ్ని. ‘చిన్నప్పుడు పిల్లలంతా ఇలానే ఉంటారు. పెద్దయితే ఆసక్తి తగ్గుతుంద’నుకునే వాళ్లట ఇంట్లోవాళ్లు. కానీ, నా ఇంట్రెస్ట్ పెద్దయ్యే కొద్దీ పెరుగుతూ వచ్చింది. దాంతో నా ఇష్టానికి అనుగుణంగానే కెరీర్ ఉండాలని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేందుకు ఎస్ఎంఆర్లో చేరా.
ఐడియా తట్టింది
ఆ కాలేజీలో చిన్నప్పట్నుంచి నాకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. నాకున్న థియరెటికల్ నాలెడ్జ్కి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం వచ్చింది. ‘నువ్వు చెయ్యగలవ్’ అంటూ ముందుకు నడిపించే లెక్చరర్స్ కూడా దొరికారు. వాళ్లందరి సపోర్ట్తో ఫ్రెండ్స్తో కలిసి ఎలక్ట్రిక్ కారుని తయారు చేశా. అది సక్సెస్ కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ, సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచనతో హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కార్లని ఎలక్ట్రిక్గా మార్చేందుకు ‘భరత్భూమి’ అనే స్టార్టప్ని స్నేహితులతో కలిసి మొదలుపెట్టా. కానీ, లాక్డౌన్ వల్ల మా పనికి బ్రేక్ పడింది. దాంతో ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆ టైంలోనే ఈ ట్రాకర్ ఐడియా తట్టింది.
అలా మొదలైంది
లాక్డౌన్లో మొదటి రెండురోజులు ఆడుతూ పాడుతూ గడిపినా.. రానురాను బోర్ మొదలైంది. క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల నుంచి అనుమానితులు, పేషెంట్స్ తప్పించుకుంటున్నారన్న వార్తలు తరచూ చెవిన పడ్డాయి. దాంతో వాళ్లెందుకు అలా చేస్తున్నారన్న ఆలోచనలో పడ్డా.. మా ఫ్యామిలీ కౌన్సిలర్ని ఫోన్లో కాంటాక్ట్ చేశా. వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఆయన్ని అడిగి తెలుసుకున్నా. అనుమానితులు, పేషెంట్స్ పారిపోతే సమాజానికే ముప్పనిపించింది. దాంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు నా మెదడుకి పని చెప్పి ఇంట్లో అందుబాటులో ఉన్న బ్యాటరీలు, రిమోట్లు, వైర్లతో ఓ ట్రాకర్ రెడీ చేయాలనుకున్నా. నా ఆలోచనలకి ఫ్రెండ్స్ అక్బర్ బేగ్, వంశీ కృష్ణ తోడయ్యారు. ముగ్గురం కలిసి రెండ్రోజుల్లోనే పేషెంట్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ డివైస్ రెడీ చేశాం.
ఇలా పనిచేస్తుంది
ఈ ట్రాకర్లో మాస్టర్ అండ్ స్లేవ్ అని రెండు డివైస్లు ఉంటాయి. మాస్టర్ డివైస్లో కమ్యూనికేషన్ కోసం బ్లూటూత్ మాడ్యూల్, ఎస్సెమ్మెస్ అలర్ట్ కోసం జిఎస్ఎమ్ మాడ్యూల్, ఈ ఆపరేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి మైక్రో కంట్రోలర్ ఉంటాయి. అలాగే స్లేవ్ డివైస్లో కూడా కమ్యూనికేషన్ కోసం బ్లూటూత్ మాడ్యూల్, పేషెంట్ లైవ్ ట్రాకింగ్ కోసం జిపిఎస్ మాడ్యూల్, మొత్తం ఆపరేషన్ని కంట్రోల్ చేయడానికి మైక్రోకంట్రోలర్ ఉంటాయి. స్లేవ్ డివైస్ని క్వారంటైన్, ఐసోలేషన్లో ఉన్న బాధితుల చేతికి బ్యాండ్లా ఫిక్స్ చేస్తాం. మాస్టర్ డివైస్ని క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో గోడలకి ఫిక్స్ చేస్తాం. స్లేవ్ అండ్ మాస్టర్ డివైస్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ బాధితులు ఆ రూం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే మాస్టర్ అండ్ స్లేవ్ డివైస్కి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. దాంతో వెంటనే మాస్టర్ డివైస్ సిబ్బందికి మెసేజ్ పంపుతుంది. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్స్లో ఎమర్జెన్సీ లైట్స్ కూడా వెలుగుతాయి. అలా అనుమానితులు లేదా పేషెంట్స్ని పట్టుకోవడం తేలికవుతుంది.
ఖర్చు తక్కువే
ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఈ ప్రయోగం చేశాం. చిన్నాచితకా ఖర్చులు లెక్కపెడితే ట్రాకర్ పూర్తయ్యే సరికి రెండువేలు అయ్యింది. తక్కువ పెట్టుబడితే ఈ ట్రాకర్ని రెడీ చేశాం. కస్టమర్ల నుంచి కూడా మేం పెట్టిన ఖర్చునే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండువేల రూపాయలకి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం లోకల్ మెడికల్ డిపార్ట్మెంట్స్తో చర్చలు జరుపుతున్నాం. బహుశా వారంలోగా మా ట్రాకర్ని క్వారంటైన్ కేంద్రాల్లో, ఐసోలేషన్ వార్డ్స్లో అందుబాటులో ఉంచుతాం.’’