రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. 'ఇంజినీరింగ్ టూల్స్ ఫర్ మాలిక్యూల్స్ బిల్డింగ్స్' పరిశోధనలకు అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. కారోలిన్ బెర్టోజి, మార్టిన్ మెల్డల్, బారీ షార్ప్లెస్ను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. సోమవారం వైద్య రంగం, మంగళవారం భౌతిక శాస్త్రం నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. గురువారం రోజున సాహిత్య రంగం నోబెల్ విజేత పేరును ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.
స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబో వైద్యరంగ నోబెల్కు ఎంపికయ్యారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకుగానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.